iDreamPost

సేవపై టిడిపి కుటిల రాజకీయం

సేవపై టిడిపి కుటిల రాజకీయం

లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక రోజువారీ అవసరాలు తీర్చుకోలేని నిరుపేదలకు వైసీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రతిపక్ష టీడీపీ అత్యంత హేయమైనా విమర్శలు చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టిడిపి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు.. అధికారం పోవడంతో ఒక్కసారిగా ప్రజలతో మాకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మేము సహాయం చేయం మరొకరిని చేయనీయం అన్నట్లుగా వైసిపి ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై యధాలాపంగా రాజకీయ బురద జల్లుతున్నారు.

కరోనా సేవా కార్యక్రమాలు పేరు చెప్పి విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని మొన్న ఆరోపించిన టీడీపీ నేతలు తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై కూడా అలాంటి ఆరోపణలు చేశారు. మంత్రి వెల్లంపల్లి విజయవాడలో వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న ఆపద సమయంలో పేదలను ఆదుకోవాల్సిన రాజకీయ నాయకులు ఆ పని చేయకపోగా చేస్తున్న వారిని అవమానించేలా ఆరోపణలు చేయడం అత్యంత హేయం. టిడిపి లోని ఓ వర్గం నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తుండగా మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు తన నియోజకవర్గంలోని ప్రజలకు అధికార పార్టీ నేతలతో పోటాపోటీగా నిత్యవసర వస్తువులు, కూరగాయలు, రక్షణ సామాగ్రి అందిస్తున్నారు.

అధికార వైసీపీలోని ప్రజాప్రతినిధులు ఎక్కువమంది తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాలు, రక్షణ సామాగ్రిని అందజేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు నియోజకవర్గ పరిధిలోని వ్యాపారులు, వైద్యులు, ప్రముఖులు, పార్టీ నేతలు విరాళాలు అందిస్తున్నారు. ఆయా మొత్తాల్లో కొంత భాగం తమ నియోజకవర్గ పరిధిలోని పేదలకు కూరగాయలు ఇతర వస్తువులు అందించిన ఎమ్మెల్యేలు మిగతా మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నారు.

సేవ చేయాలన్న తపన, ఆలోచన వ్యాపారులు, ఇతర ప్రాణులకు ప్రముఖులకు ఉన్నా అందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులు ప్రస్తుత సమయంలో సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే సహాయం చేయాలనుకునే వాళ్ళు తమనియోజకవర్గ ప్రజాప్రతినిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ మొత్తంలో తమ నియోజకవర్గంలోని నాయకులు ప్రముఖులు తరఫున విరాళాలు ఇచ్చిన విషయం విదితమే.

తాజాగా ఈ రోజు సోమవారం ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే  కుందూరు నాగార్జున రెడ్డి 90 లక్షల రూపాయలు, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఒక కోటి 25 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. అందుకు సంబంధించిన చెక్కులను సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఈ నేతలు తమ నియోజవర్గంలోని ప్రజలకు కూరగాయలు, ఇతర వస్తువులు అందించి మిగతా సొమ్మును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. వ్యాపారులు ఇతర ప్రముఖులు పార్టీ కార్యకర్తలు ఇచ్చే విరాళాలకు.. టిడిపి నేతలు వైసీపీ ప్రజా ప్రతినిధులు బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారనడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి