iDreamPost

టిడిపి మహానాడు ఓ పెద్ద మాయంటా..! నిజ‌మేనా?…నిజ‌మేనంటున్న ఆ పార్టీ నేత‌లు..!

టిడిపి మహానాడు ఓ పెద్ద మాయంటా..! నిజ‌మేనా?…నిజ‌మేనంటున్న ఆ పార్టీ నేత‌లు..!

టిడిపి ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే మ‌హానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జ‌రిగింది. టిడిపి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ మ‌హానాడుకు కొంత మంది నేత‌లు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజ‌రైనా బ‌హిరంగంగానే త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ఈ మహానాడు కేవ‌లం అధికార వైసిపిని తిట్ట‌డానికి, చంద్ర‌బాబును పొగుడుకోవ‌డానికి పెట్టిన‌ట్టు జ‌రిగింది. టిడిపిలో నేత‌లెవ్వ‌రూ కృషి లేన‌ట్లు..ఒక్క చంద్ర‌బాబు కృషి మాత్ర‌మే ఉన్న‌ట్లు ఆయ‌న‌ను సంతృప్తి ప‌రిచేందుకే ఆయ‌న భ‌జ‌న బృందం మొగ్గు చూపింది. ఈ మ‌హానాడు మ‌రో ముఖ్య‌మైన అంశమేంటంటే…టిడిపి వ్య‌వ‌స్థాప‌కుల కుటుంబం నుంచి గ‌తంలో పాల్గొన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ వంటి వారు కూడా ఈ మ‌హానాడులో పాల్గొన‌లేదు. వారిని పూర్తిగా విస్మ‌రించారు. కేవ‌లం చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ మాత్ర‌మే ఈ మ‌హానాడుకు హాజ‌రైన‌ట్లు స‌మాచారం.

ఎలాగో ఒక‌లా జ‌రిగింద‌నుకోండీ…వాళ్ల‌దేదో వాళ్ళు పెట్టుకోవ‌డం మాని, త‌మ ప్ర‌భుత్వాన్ని, త‌మ నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేసి పెట్టిన మ‌హానాడుపై వైసిపి నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. టిడిపి మ‌హానాడు ఓ పెద్ద మాయ అని చ‌ర్చ జ‌రుగుతుంది. అది నిజ‌మేన‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

టిడిపి మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విశాఖ‌ప‌ట్నం మెట్రోపొలిట‌న్ రీజ‌న్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ (విఎంఆర్‌డిఎ) చైర్మన్‌, ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ విమర్శించారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, కుంబా రవిబాబు తో కలిసి ద్రోణం రాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ”ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకిగా మారారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్మోహ‌న్‌ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారు” అని దుయ్య‌బ‌ట్టారు.

” 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సిఎంగా వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్‌ జగన్‌ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం” అని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు.

”వైఎస్ జగన్‌ పాలనలో అందిస్తున్ననవ రత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్‌జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్ట పరిహారం అడిగితే సిఎం జగన్‌ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్‌జీ పాలిమర్స్ విషయంలో టిడిపిది శవ రాజకీయం” అంటూ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మండిపడ్డారు.

ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సిఎం వైఎస్‌ జగన్ గుర్తించారని మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు తెలిపారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సిఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు. మహానాడు తీర్మానాలు చూస్తుంటే టిడిపి పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు.

టిడిపి పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టిడిపి అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా, జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయ స్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి