iDreamPost

తన చిరకాల కోరిక నెరవేరిందంటున్న రాజమౌళి.. వీడియో వైరల్!

  • Author singhj Published - 05:52 PM, Tue - 11 July 23
  • Author singhj Published - 05:52 PM, Tue - 11 July 23
తన చిరకాల కోరిక నెరవేరిందంటున్న రాజమౌళి.. వీడియో వైరల్!

సినిమాలకు ఎలాంటి హద్దులు లేవని నిరూపించిన వారిలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. మంచి చిత్రం తీస్తే భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన మూవీస్​తో ప్రూవ్ అయింది. ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్ని గొప్ప సినిమాలు వస్తున్నా అవి భారతీయ చిత్రాలుగా గుర్తింపునకు నోచుకోని పరిస్థితి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్​ అనే భావన అందరిలో ఉండేది. కానీ దీన్ని పూర్తిగా మార్చేశారు జక్కన్న. ‘బాహుబలి’తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాషా చిత్రాల సత్తా ఏంటో చూపెట్టారు. ఆ తర్వాత ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేశారు.

రాజమౌళి చూపిన బాటలో మిగతా ఫిల్మ్ మేకర్స్ కూడా ప్రయాణిస్తున్నారు. కంటెంట్ బాగున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి జక్కన్న తర్వాత చేయబోయే సినిమాపై అందరి దృష్టి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించి రాజమౌళి ఏదైనా అప్​డేట్ ఇస్తారేమోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం ఆధ్యాత్మిక యాత్రతో బిజీ అయిపోయారు. తమిళనాడులోని పలు ప్రముఖ దేవాలయాలను కుటుంబసమేతంగా ఆయన సందర్శించారు.

ఆధ్యాత్మిక ప్రయాణం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని రాజమౌళి తెలిపారు. రోడ్​ ట్రిప్ చేస్తూ ఆలయాలను సందర్శించాలని చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నానని.. మొత్తానికి ఇది నెరవేరిందన్నారు. ఈ విషయంలో తన కూతురుకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు జక్కన్న. శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరంతో పాటు కనడుకథన్, తూత్తుకుడి, మధురై ఆలయాలను సందర్శించామన్నారు. ఆ ఆలయాల్లోని శిల్పకళ చూసి షాకయ్యానన్నారు. చోళుల కాలంలో ఎంతో గొప్ప ఇంజినీర్లు ఉన్నారని రాజమౌళి చెప్పుకొచ్చారు. వారి టాలెంట్ తనను మంత్రముగ్ధుడ్ని చేసిందన్నారు. ఇకపోతే, మహేష్​తో సినిమా పూర్తయిన వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్ట్​ ‘మహాభారతం’ను ప్రారంభించే ఆలోచనల్లో ఉన్నారు రాజమౌళి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి