idream media
idream media
గుండె బరువెక్కి రాస్తున్న వార్త.. చిత్ర పరిశ్రమని తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త.. పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) నేడు (మంగళవారం) తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.
కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, ICU లో చికిత్స అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం తుది శ్వాస విడిచారు.
సిరివెన్నెల గారి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. సిరివెన్నెల మరణం టాలీవుడ్కి, సినీ సాహిత్య రంగానికి తీరని లోటు. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకు `2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని గౌరవించింది. దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు ఆయన.
`సిరివెన్నెల`, `శృతి లయలు`, `గాయం`, `స్వర్ణకమలం`, `శుభలగ్నం`, `సింధూరం`, `ప్రేమ కత`, `శ్రీకారం`, `చక్రం`, `గమ్యం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి చిత్రాల్లోని అయన రాసిన మరుపురాని పాటలకు అవార్డులు అందుకున్నారు.
నేడు ఆయన ఆకస్మిక మరణంతో అటు సాహిత్య రంగానికి.. ఇటు సినీ లోకానికి చీకటి రోజుగా చరిత్రలో నిలిచిపోయింది.
Also Read : Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ అస్తమయం