iDreamPost

Radhe Shyam : 30 రోజుల గడువుతో పాన్ ఇండియా రన్

Radhe Shyam : 30 రోజుల గడువుతో పాన్ ఇండియా రన్

సాహో తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా సరైన టీజర్ రాలేదు. సమయం లేదు కాబట్టి ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారు. రెండున్నర నిమిషాల పాటు ఉండే వీడియో ఎడిటింగ్ పూర్తి చేసుకుని డేట్ ని లాక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. రేపో ఎల్లుండో ప్రకటన ఉండొచ్చు. కానీ ప్రమోషన్ల విషయంలోనే రాధే శ్యామ్ దూకుడు పెంచాల్సి ఉంది. ఒకపక్క ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చాక మెట్రో స్పీడ్ తో పబ్లిసిటీ వేగాన్ని పెంచింది. రాజమౌళి ఇద్దరు హీరోలతో సహా అలియా భట్ ని, నిర్మాతని వెంటేసుకుని కాళ్లకు చక్రాలు కట్టినట్టు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

దీని వల్లే నేషనల్ మీడియాలోనూ ఆర్ఆర్ఆర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న ముంబైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. హైదరాబాద్ తో సహా ఇతర నగరాల్లో తర్వాత ప్లాన్ చేస్తారు. ఈ ఇరవై రోజుల వ్యవధిలో తన సినిమానే చర్చల్లో ఉండేలా జక్కన్నా ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్న మాట వాస్తవం. కానీ రాధే శ్యామ్ క్రేజ్ దాని సమాన స్థాయిలో ఉన్నప్పటికీ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం తప్ప దేని మీదా దృష్టి పెట్టలేదు. ప్రభాస్ కటవుట్ ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదనుకుంటే పొరపాటే. పెట్టుబడులు సేఫ్ అవ్వోచ్చేమో కానీ అభిమానులకు సినిమా బ్లాక్ బస్టర్ కావడం ముఖ్యం.

దానికైనా ప్రచారం కావాల్సిందే. సో ఇకపై యువి ప్లానింగ్ ఎలా ఉండబోతోందనేది కీలకంగా మారనుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ టైం పీరియడ్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా కోపంగా ఉన్నారు. పాన్ ఇండియా అంటే ఆర్ఆర్ఆర్ లాగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే తమకూ ఉత్సాహంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు రాధే శ్యామ్ ట్రైలర్ మీదే. అంచనాలను మించి ట్రిపులార్ లాగా గూస్ బంప్స్ ఇచ్చేలా వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి

Also Read : Multi Starrer : మల్టీ స్టారర్ లు రావాలంటే జరగాల్సింది ఇది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి