iDreamPost

ప్రభాస్ నెంబర్స్ మారుతున్నాయా

ప్రభాస్ నెంబర్స్ మారుతున్నాయా

రాధే శ్యామ్ ఇంకొద్ది రోజులు షూట్ చేస్తే అయిపోతుంది. విడుదల ఎప్పుడనేది ఇంకా డిసైడ్ చేయలేదు కానీ ఫస్ట్ గుమ్మడికాయ కొట్టేస్తే తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. తర్వాత చేయబోయేవి కూడా ఆల్రెడీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సలార్, అది పురుష్ లు అటుఇటుగా ఒకే టైంలో షూటింగ్ జరుపుకుంటాయి. వీటికి సాహో లాగా ఎక్కువ డేట్లు అవసరం లేకుండా ముందే ప్లాన్ చేసుకున్నారు. రాధే శ్యామ్ కౌంట్ ప్రకారం చూసుకుంటే 19వ సినిమా అవుతుంది. పైన చెప్పిన రెండు 21 దాకా అవుతాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నాగ అశ్విన్ చేయబోయేది 22వ మూవీ. అయితే ఇప్పుడీ నెంబర్లో మార్పులు జరగొచ్చని ఇన్ సైడ్ టాక్.

ఇప్పటిదాకా తెలుగు తెరమీద ఎన్నడూ చూడని కథాంశం గ్రాఫిక్స్ తో రూపొందబోయే ఈ చిత్రాన్ని ప్రభాస్ 25 వ సినిమాగా చేయాలని నిర్మాత అశ్వినిదత్ ప్లాన్ చేశారట. ల్యాండ్ మార్క్ నెంబర్ కాబట్టి దానికి అనుగుణంగానే ఇంత రేంజ్ ఉంటేనే న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నారట. ఇదే కనక నిజమైతే ప్రభాస్ మరో మూడు సినిమాలు దీనికన్నా ముందు చేయాలి. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఓ స్క్రిప్ట్ తో ఎదురు చూస్తున్నాడు. మరో అయిదారు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ఎవరికి ఓకే చెప్తాడు ఎవరికీ నో అనేది ఇంకొద్దిరోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ఇదంతా కొంచెం అనుమానంగానే ఉంది.

ఇప్పుడీ చర్చ రావడానికి కారణం వైజయంతి ప్రాజెక్టుకి పని చేస్తున్న కెమెరా మెన్ డానీ లోపెజ్ నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ దీన్ని ప్రభాస్ 25 అని పేర్కొన్నాడు. తెలియక అన్నాడో లేక ముందే ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ ఇప్పుడిది అభిమానుల మధ్య కొత్త సందేహాలకు తావిచ్చింది. మరోవైపు ప్రభాస్ ఓ రెండు మీడియం బడ్జెట్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడని, మిర్చి టైపు లో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చేసే ప్లాన్ ఉందని సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రొడక్షన్ యూనిట్ నుంచి కానీ నాగ అశ్విన్ నుంచి కానీ దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తే బెటర్. నెంబర్ల సంగతి తేలిపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి