iDreamPost

ఇంగ్లిష్‌ మీడియం కోసం ఇంట్లోనే కుటుంబం దీక్ష..

ఇంగ్లిష్‌ మీడియం కోసం ఇంట్లోనే కుటుంబం దీక్ష..

ఇంగ్లిష్‌ మీడియంలో తన పిల్లలను చదివిస్తూ తెలుగు భాషోద్ధారణ ప్రసంగాలు చేసే ప్రముఖులు, పేదలకు మేలు చేసే విషయాలను అడ్డుకునే విద్వేష విపక్ష కూటములు అన్నీ కలసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను అడ్డుకునే కుట్రలు ఒక వైపు సాగిస్తున్నాయి. కోర్టులకెక్కి, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కారణమయ్యే ఇంగ్లిష్‌ మీడియంను తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ పేద ప్రజల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమంపై ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ముందుకు వెళ్లాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అని వారికి తెలుసు. అందుకే ఇంగ్లిష్‌ మీడియంకు వ్యతిరేకంగా కొందరు చేస్తున్న అవాంతరాలపై పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను అమలు చేయాలంటూ ఓ పేద తండ్రి తన పిల్లలతో కలసి రోజూ ఇంట్లోనే నిరసన దీక్ష చేస్తున్నాడు.

చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు. వారిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఈ ఏడాది నుంచి అందులో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఎంతో సంతోషపడ్డారు. తన పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలతో సమానంగా ఇంగ్లిష్‌ మీడియంలో చదవి ఉన్నతస్థానాలకు వెళ్తారని ఆనందించాడు. అయితే ప్రస్తుతం కలుగుతున్న అవరోధాలపై ఆవేదన పడ్డాడు. తన లాంటి తండ్రుల ఆవేదనను చెప్పాలనుకున్నాడు. ఆ నేపథ్యంలోనే రోజూ తన ఇంట్లోనే పిల్లలతో కలసి ఇంగ్లిష్‌ మీడియం కావాలంటూ ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

మూడు గ్రామాల ప్రజలకు మాత్రమే ఉపయోగపడే అమరావతి ఉద్యమాన్ని ప్రజాధరణ లేకున్నా నెలల తరబడి చూపిస్తున్న ఓ వర్గం మీడియాకు.. ఇంగ్లిష్‌ మాధ్యమం కోసం పేదలు పడుతున్న ఆవేదన కనిపించదు. కనిపించినా.. కనిపించనట్లు ప్రవర్తిస్తుంది. వినిపించినా పుట్టు చెవిటి దానిలా ఉండిపోతుంది. కానీ అంతిమంగా పేదలే విజయం సాధిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి