iDreamPost

రాజకీయంతో కాదు మనస్సుతో చూడిండి చినబాబు..!

రాజకీయంతో కాదు మనస్సుతో చూడిండి చినబాబు..!

రాజకీయాలంటే విమర్శలు, ప్రతివిమర్శలు. అయితే విమర్శలు చేసేందుకు కూడా హద్దు ఉంటుంది. ఆ విమర్శల్లో హేతుబద్ధత ఉండాలి. లేదంటే ప్రజల దృష్టిలో చులకన కావడంతోపాటు.. వారు అసహించుకునే పరిస్థితికి కూడా వస్తుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా.. వైసీపీ ప్రభుత్వం, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేసేందుకు ప్రతి అంశాన్ని రాజకీయ విమర్శలకు వినియోగించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ వ్యవహరిస్తున్న తీరు.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందంగా మారింది.

సోషల్‌ మీడియా వేదికగా నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్‌జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. సహేతుకమైన విమర్శలైతే ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు.. కానీ కరోనా మరణాలను కూడా చినబాబు రాజకీయ విమర్శల కోసం వినియోగించుకుంటున్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలను హేళన చేసేలా ప్రకటనలు చేస్తున్నారు. ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తిగా.. కరోనా బాధితులకు పరీక్షల నుంచి చికిత్స వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందు కోసం ఎంత ఖర్చు అయినా పెడతామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు. సీఎం నోట నుంచి వచ్చిన మాట ప్రజల్లో భరోసా నింపుతుందన్న మాట వాస్తవం.

అయితే ప్రజలకు ప్రభుత్వం ఉందనే భరోసా కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఈ వ్యాఖ్యను హేళన చేసేలా నారా లోకేష్‌ విమర్శలు చేశారు. ‘‘ ప్రాణం విలువ తెలిసిన ముఖ్యమంత్రీ.. మీరు పట్టించుకోకనే పది వేల మంది చనిపోయారు’’ అంటూ నారా లోకేష్‌ విమర్శలు చేయడం ఆయన అపరిపక్వత రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అభివృద్ధి చెందిన అమెరికాలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. వైరస్‌కు వారు, వీరు అనే తేడా ఏమీ లేదు. భారత్‌లోనూ వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది. ఇందులో పది వేల మంది ఏపీ వారు ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో మరణాలు తక్కువే. ఈ సంఖ్య తక్కువగా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. వైరస్‌ బాధితులను గుర్తించడం, వారికి పరీక్షలు చేయడం, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు చేయడం, సకాలంలో వైద్యం అందించం వల్ల మరణాల సంఖ్య తక్కువగా ఉంది. దురదృష్టవశాత్తూ కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం కానీ. మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయని విధంగా.. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్‌కు అండగా ఉండేలా.. వారి పేరున పది లక్షల రూపాయలు ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తోంది. దానిపై వచ్చే వడ్డీతో ఆ పిల్లల జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. అంతేకాకుండా వారి చదువుల బాధ్యతను తీసుకుంది. ఇంతకు మనుపు తల్లి, లేదా తండ్రి ఇతర కారణాలతో చనిపోయి.. ఇప్పుడు మిగిలి ఉన్న తల్లి, తండ్రి కరోనా వల్ల చనిపోయినా.. వారి పిల్లలకు పది లక్షల రూపాయలు జగన్‌ సర్కార్‌ అందిస్తోంది.

వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎవరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా వైఎస్‌ జగన్‌ పాలన సాగించారు. ఇంతలా ఏపీ ప్రజలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా సమయంలో అండగా ఉంటోంది. ప్రభుత్వం చేస్తున్న పనిలో మంచి కనిపించాలంటే.. రాజకీయ నేతగా కాదు.. సాధారణ వ్యక్తిగా చూస్తేనే తెలుస్తుంది. ఒకసారి సాధారణ వ్యక్తిగా చినబాబు ఆలోచిస్తే.. మంచేదో, చెడేదో కనిపిస్తుంది. మరి లోకేష్‌ సాధారణ వ్యక్తిగా చూడగలరా..?

Also Read : లోకేష్ ఇక పరామర్శలకే పరిమితమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి