iDreamPost

దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా.. దర్శకుడిగా త్రివిక్రమ్!

దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా.. దర్శకుడిగా త్రివిక్రమ్!

దిల్ రాజు నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుంచి ఎన్టీఆర్- దిల్ రాజు కలయికలో సినిమా రాలేదు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ కాబోతుంది.

దిల్ రాజుని ఎన్టీఆర్ దూరం పెట్టాడని.. అందుకే చాలా కాలంగా ఆయన బ్యానర్ లో సినిమా చేయట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. తనను ఎన్టీఆర్ దూరం పెట్టాడనే ప్రచారంలో వాస్తవం లేదని అన్నాడు. తమ మధ్య ఎప్పుడూ మంచి బాండింగ్ ఉంటుందని చెప్పాడు. అంతేకాదు తామిద్దరం కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామని, ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ని దిల్ రాజు కలిశాడని వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 తర్వాత తన నిర్మాణంలో సినిమా చేయాలని దిల్ రాజు అడగగా.. అప్పుడు దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు ఎన్టీఆర్ సూచించినట్లు ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం నుంచి హారిక అండ్ హాసిని బ్యానర్ లో తప్ప వేరే బ్యానర్ లో సినిమా చేయడంలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం దిల్ రాజు బ్యానర్ లో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఒకవేళ దిల్ రాజు కచ్చితంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలోనే సినిమా చేయాలనుకుంటే మాత్రం హారిక అండ్ హాసిని భాగస్వామ్యంతో చేయడం తప్ప వేరే దారి లేదు.

నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని త్రివిక్రమ్ తోనే చేయాల్సి ఉన్నా ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, కేవలం వాయిదా పడిందని.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆ సినిమా చేస్తామని నిర్మాత నాగవంశీ చెప్పాడు. మరి ఆ ప్రాజెక్ట్ లో దిల్ రాజు భాగస్వామిగా ఉంటాడేమో చూడాలి.

ఒకవేళ ఎన్టీఆర్ తో తాను సోలోగానే సినిమా చేయాలని దిల్ రాజు భావిస్తే మాత్రం.. దర్శకుడిగా శంకర్ లేదా వంశీ పైడిపల్లి రంగంలోకి దిగే అవకాశముంది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి