iDreamPost

లాక్‌డౌన్‌ నుంచి మరో కీలక సడలింపు

లాక్‌డౌన్‌ నుంచి మరో కీలక సడలింపు

లాక్‌డౌన్‌ 3.0 నుంచి పలు అంశాలకు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా 4.0 లో మరిన్ని సడలింపులు ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యంత ముఖ్యమైన రవాణా వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే రోడ్డు రవాణా సేవలపై ఆంక్షలు తొలగించగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి సాధారణ రైళ్లు కూడా తిరిగేలా నిర్ణయాలు తీసుకుంది.

తాజాగా విమానయాన సర్వీసులపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ నెల 25వ తేదీ నుంచే దేశీయ విమానాలు తిప్పునున్నట్లు తెలిపింది. అయితే అన్ని విమానాశ్రయాలను పునఃప్రారంభిస్తారా..? లేదా..? అనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దేశంలో ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, ఢిల్లీ తదితర ప్రధాన నగరాల్లో వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ విమానాల రాకపోకలపై పరిమితమైన ఆంక్షలు ఉంటాయన్న చర్చ సాగుతోంది.

కాగా, ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మిషన్‌ వందే భారత్‌ను ప్రారంభించింది. ఈ మిషన్‌ కింద ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లో ఉన్న మన వారిని స్వదేశానికి తీసుకువస్తోంది. తాజాగా స్వదేశీ విమానాలను తిప్పాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రజా రవాణాలో త్రిమూర్తులైన రోడ్డు, రైలు, వాయి మార్గాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి