iDreamPost

ఆర్ధిక సాయం పెంచండి – ఆర్ధిక సంఘానికి సీఎం జగన్ వినతి

ఆర్ధిక సాయం పెంచండి – ఆర్ధిక సంఘానికి సీఎం జగన్ వినతి

విభజన వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికి పూడ్చుకోలేకపోతున్నామని, కొత్త రాష్టానికి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఆర్ధిక సాయం చేయాలనీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 15 వ ఆర్ధిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని ఆర్ధిక సంఘాన్ని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాన్ని గత సర్కారు ఆర్థికంగా దివాళా ఎలా దివాళా తీయించిందో ఆర్ధిక సంఘానికి సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవశ్యకతలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు. అక్షరాస్యత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మహిళలు, పిలల్లో పౌష్టికాహార లోపం నివారణకు తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు.

రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ‘ప్రత్యేక హోదా’ హామీ ఇప్పటికీ నెరవేరలేదని గుర్తు చేశారు. కాగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది . అందులో భాగంగానే తాగాజా 15 వ ఆర్ధిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి