iDreamPost

Chiranjeevi: అందరిలో నన్ను అవమానించారు.. అదే నాలో కసిని పెంచింది: చిరంజీవి

  • Published Apr 01, 2024 | 8:17 AMUpdated Apr 01, 2024 | 8:17 AM

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కొన్న ఓ అవమానకర సంఘటన గుర్తు చేసుకున్నారు. అదే తనలో కసిని పెంచింది అన్నారు. ఆ వివరాలు..

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కొన్న ఓ అవమానకర సంఘటన గుర్తు చేసుకున్నారు. అదే తనలో కసిని పెంచింది అన్నారు. ఆ వివరాలు..

  • Published Apr 01, 2024 | 8:17 AMUpdated Apr 01, 2024 | 8:17 AM
Chiranjeevi: అందరిలో నన్ను అవమానించారు.. అదే నాలో కసిని పెంచింది: చిరంజీవి

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. సినీ పరిశ్రమలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శం. నేటి తరం నటీనటులకు కూడా ఆయన సినీ ప్రస్థానం స్ఫూర్తి. అయితే చిరంజీవి నేడు ఈ స్థాయికి చేరడానికి ఎంతో శ్రమించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను తాను నిరూపించుకుంటూ.. మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. అంతేకాక తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు కూడా చవి చూశారు. అన్నింటిని తట్టుకుంటూ.. ముందుకు సాగారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న ఓ అవమానం తనలో కసిని పెంచిందని.. అదే తనను ఈ స్థాయిలో నిలిపింది అంటున్నారు చిరంజీవి. ఆ వివరాలు..

తొలిసారి జరిగిన తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నటులు పలు విషయాలపై ముచ్చటించారు. అనేక అంశాలపై చిరుకు ప్రశ్నలు సంధించారు రౌడీ హీరో. ఈ సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న ఓ అవమానం గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి. అదే తనలో కసిని పెంచింది అని గుర్తు చేసుకున్నారు.

chiranjeevi shocking comments

అంతమంది ముందు నన్ను అవమానించారు..

తన కెరీర్లో తాను చాలా అవమానాలు, ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, వాటిని దాటుకుంటూ వచ్చానని చిరంజీవి తెలిపారు. వాటిలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. “న్యాయం కావాలి అనే సినిమా.. శారద చాలా గ్యాప్ తర్వాత ఆ చిత్రం చేశారు. డిఫెన్స్ లాయర్‌గా ఆ సినిమాలో నటించారు. దానిలో జగ్గయ్య, రాధిక కూడా ఉన్నారు. ఆ సినిమా నిర్మాత క్రాంతి కుమార్ క్రేన్‍పై కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు. షూటింగ్ కావడంతో అక్కడ 3, 4 వందల మంది జూనియర్ అర్టిస్టులు ఉన్నారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను పిలిచాడు. ఆ తర్వాత నేను వెళ్లి నా బోనులో నిల్చున్నా. అప్పుడు క్రాంతి కుమార్ నన్ను అందరి ముందు అరిచారు. ‘ఏంటండి మిమ్మల్ని కూడా పిలవాలా. వచ్చి ఇక్కడ పడి ఉండలేరా మీరు. ఏంటి.. మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా’ అంటూ అరిచారు. దీంతో నా గుండె పిండేసినట్టయింది” అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఆ సంఘటన తర్వాత తాను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం క్రాంతి కుమార్ తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. శారదపై చిరాకును తనపై చూపించానని క్రాంతి కుమార్ తెలిపారు. కానీ అది సరైన పద్ధతి కాదని, అంతమంది ముందు అంత అవమానానికి గురవడం తనను చాలా బాధపెట్టిందని చిరంజీవి క్రాంతి కుమార్ తో అన్నారట.

ఆ అవమానం నాలో కసిని పెంచింది

’’ఆ అవమానం నాలో కసిని పెంచింది. క్రాంతి కుమార్ అన్న అన్ని మాటలను వదిలేసినా.. ‘నువ్వు సూపర్ స్టార్ అనుకున్నావా’ అనే మాటను మాత్రమే బాగా గుర్తుంచుకున్నాను. ‘అవును.. నేను సూపర్ స్టార్ అయి చూపిస్తా’ అని ఆ రోజే అనుకున్నాను. ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నాను. అలాంటివి నా కెరీర్లో చాలా జరిగాయి. వాటన్నింటిని నాకు అనుకూలతలుగా మార్చుకుని.. ఈ స్థాయికి ఎదిగాను. నాకు ఎరిపైన ద్వేషం లేదు‘‘ అని చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి  తన 156వ సినిమా అయిన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి