iDreamPost

Chiranjeevi Pays Homage : పునీత్ కోసం తల్లడిల్లుతున్న హృదయాలు

Chiranjeevi Pays Homage : పునీత్ కోసం తల్లడిల్లుతున్న హృదయాలు

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కన్నడ పవర్ స్టార్ పునీత్ తాలూకు జ్ఞాపకాల నుంచి మాములు ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఉదయం బాలకృష్ణ, రానా, జూనియర్ ఎన్టీఆర్, నరేష్ తదితరులు వ్యక్తిగతంగా పునీత్ పార్ధీవ దేహాన్ని సందర్శించుకున్నాక ఇందాక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తదితరులు తమ ఆత్మీయుడి చివరి చూపు దక్కించుకున్నారు. వీళ్ళతో పాటు శ్రీకాంత్ అలీ కూడా ఉన్నారు. స్నేహితుడిని చూడగానే అన్నయ్య శివ రాజ్ కుమార్ దుఃఖం ఆపుకోలేక పోయారు. చిరు సైతం చెమ్మగిల్లిన కళ్ళను నియంత్రించుకోలేక శోక వదనంతో కనిపించారు. పరస్పరం పలకరించుకున్నారు

వెంకటేష్ కు సైతం ఈ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. గతంలో క్రికెట్ మ్యాచులు పలు సినిమా ఈవెంట్లలో కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. పునీత్ కుమార్తె కొద్ది నిముషాల క్రితమే కంఠీరవ స్టేడియం కు చేరుకున్నారు. చిన్నాన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ ముందే భయపడినట్టు ఆ అమ్మాయిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. అక్కడున్న వాళ్ళు ముందు నుంచి పునీత్ ని చూస్తూ ఉన్నప్పటికీ ఈ క్షణాల్లో మాత్రం మరోసారి కన్నీరు మున్నీరయ్యారు. గత ఇరవై నాలుగు గంటలకు పైగా సాగుతున్న ఈ మహా విషాదం నుంచి నగరం బయటికి రాలేకపోతోంది. పగలే చీకటిగా మారిన వాతావరణం ఎవరికీ మింగుడు పడటం లేదు.

యాక్షన్ కింగ్ అర్జున్ ఇందాకే పునీత్ తో ఉన్న అనుబంధాన్ని చిన్న వయసులోనే తను సాధించిన ఘనతలను మీడియాకు వివరించారు. రేపు అంత్యక్రియలని మధ్యాన్నమే ప్రకటించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. పొద్దు పొడిచింది కాబట్టి ఇప్పుడు చివరి ఘట్టం సాధ్యం కాదు. రేపటి సమయం వేదికను రాత్రి కాస్త ఆలస్యంగా చెబుతామని కుటుంబ సభ్యులు చెప్పారు. లక్షలాది అభిమాన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానులతో ఇసుక వేస్తే రాలనంతగా స్టేడియం నిండిపోయింది. ప్రతి కంటిపాపల్లోనూ కన్నీటి ధారలు కనిపిస్తూనే ఉన్నాయి.

Also Read : Puneeth Final Rites: పునీత్ చివరి చూపు కోసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి