iDreamPost

సరస్వతి పవర్ ఇండస్ట్రీ పై తెలుగుదేశం మార్క్ రాజకీయం.

సరస్వతి పవర్ ఇండస్ట్రీ పై తెలుగుదేశం మార్క్ రాజకీయం.

ఎన్నికల్లో ఓటమి పాలయిన రోజు నుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు, యెల్లో మీడియా కూటమి కలిసి ఒక పధకం ప్రకారం ప్రభుత్వం పై, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పై లేని పోని అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో చులకన చేయాలనే ప్రయత్నం తీవ్రతరం చేశారు. ఇప్పటికే పించన్ల పెంపు దగ్గరనుండీ మడ అడవుల వరకు సాగించిన అసత్య ప్రచారం ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలోకి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ని నెట్టే ప్రయత్నం ముమ్మరం చేసినట్టు కనిపిస్తుంది.

ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ స్టేక్ హోల్డర్ కంపెనీ అయిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు గనుల లీజును 50ఏళ్ళకు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని, ఇది జగన్ చేస్తున్న అధికార దుర్వినియోగం అని చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే ఆ మాటలను ఆ పార్టీ అనుకూల పత్రికలు పతాక శీర్షికల్లో అచ్చువేసి తమ స్వామి భక్తిని నిరూపించుకున్నాయి. కానీ వాస్తవంగా ముఖ్యమంత్రిగా జగన్ అధికార దుర్వినియోగంకి పాల్పడ్డారా , నిభందనలకు విరుద్ధంగా వ్యవహరించారు అని చెప్పడానికి చట్టంలో ఏ ప్రాతిపదికన చంద్రబాబు ఆరోపణలు చేశారు అనే అంశాలను ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాయి .

సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ పై ఆదినుంచి కుట్రలే.

2009లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో సరస్వతి పవర్‌కు 613 హెక్టార్లలో(1,515 ఎకరాల్లో) నాటి ప్రభుత్వం అప్పుడు ఉన్న నిబందలకు లోబడి 30ఏళ్ళకు సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేస్తు G.O.Ms.No.129ని విడుదల చేసింది. స్థానిక రైతుల నుంచి నాటి మార్కెట్ ధర కన్నా రెండింతలు ఎక్కువ పెట్టి భూమి రకాన్ని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి 8.5 లక్షల వరకూ చెల్లించి భూమిని కంపెనీ కొనుగోలు చేసింది. అవి పూర్తిగా మెట్ట భూములు కావటంతో ప్లాంటు నిర్మాణానికి నీటి అవసరం ఉంటుంది కనక పక్కనే ఉన్న కృష్ణా నది నుంచి నీరు కేటాయించాలని సంస్థ 2009లో దరఖాస్తు చేసింది. అయితే వై.యస్ చనిపోవడంతో రాజకీయంగా వచ్చిన విభేదాలతో నాటి కాంగ్రేస్ ప్రభుత్వం కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టింది. అలాగే అటవీ, పర్యావరణ అనుమతుల కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేస్తే. మూడేళ్లపాటు నాన్చిన కేంద్రం 2012లో అనుమతులిచ్చింది.

ప్రజా నేతగా ఎదుగుతున్న జగన్ను ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి ఆయన ఆస్తుల పై కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి వేసిన కేసుల్లో కొన్ని సంస్థలను ఇరికించే ప్రయత్నం చేసినా సరస్వతి పవర్ సంస్థ పై ఎలాంటి అభియోగం మోపడానికి సరైనా కారణం లేకపొయేసరికి సీబీఐ ఈ సంస్థకు క్లీన్చిట్ ఇస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ఈ సంస్థపై మరో కుట్రకు తెరలేపాయి. కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న భూముల్లో కంపెనీ పెట్టాలనుకున్నపుడు స్థానికుల ఉపాధి కోసమైనా ప్రభుత్వం సహకరించడం కనీసం దర్మం అన్న సంగతి కూడా మర్చిపొయి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరు కేటాయించకుండా, పీసీబీ అనుమతులివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇక కాంగ్రెస్ తో రహస్యంగా లాలూచి నడిపిన నాటి తెలుగుదేశం స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతల ముసుగులో ఆ భూముల్లో పంటలు వేయించారు. అడ్డుకున్న సంస్థ ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.

ఇది ఇలా ఉండగా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో తమ ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలను స్థాపించకూడదని, స్థాపించినా అవి నడవకుండా చేయాలనే ఆలోచనతో సరస్వతి సిమెంట్‌కు నీళ్లు, కరెంటు అనుమతులు ఇవ్వకపోగా మైనింగ్‌ లీజ్‌ రద్దు చేస్తు G.O.Ms.No.98 ని విడుదల చేసి నేరుగా కక్షసాదింపు చర్యకు దిగారు . చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూములు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వెనకబడిన పల్నాడు ప్రాంతం వాసులు ఒక్కసారిగా తిరగబడ్డారు, చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తూర్పారబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దీంతో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ వారికి ధైర్యం చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ స్థాపించి మీకు ఉద్యోగాలు కల్పిస్తానని, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ లీజు రద్దు పై కోర్టులో పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చినట్టుగానే లీజు రద్దు వ్యవహారం పై కోర్టు తలుపులు తట్టారు జగన్. దీనిపై విచారణ జరిపిన కోర్టు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లీజును రద్దు చేయడం అన్యాయం అని , దానిని పునరుద్దరించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాల ఆదారంగా గనుల శాఖ అధికారులు లీజుని పునరుద్దరిస్తు G.O.Ms.No.109ని విడుదల చేసింది. అలాగే 2015 మైనింగ్ సవరణ చట్టం లోని సెక్షన్ 8ఏ(3) నిబందన ప్రకారం తప్పనిసరిగా లీజుని గతంలో ఉన్న 30 ఏళ్ళ నుండి 50ఏళ్లకు పొడిగించింది. 2015లో ఎన్.డి.ఏ తీసుకువచ్చిన ఈ చట్టం అనుసరించి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సైతం రాష్ట్రంలో ఉన్న కంపెనీల మైనింగ్ లీజులను 30 ఏళ్ళ నుండి 50ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవం ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం మైనింగ్ లీజును 30ఏళ్ళ నుండి అక్రమంగా 50ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్దారని చెప్పడం, అలాగే తాను రాజకీయాల్లోకి రాకముందు నుండి ఉన్న కంపెనీ వ్యవహారంలో అనేక మలుపులు తీసుకుని చివరికి కోర్టు ఉత్తర్వుల ద్వారా తిరిగి పునరుద్ధరణ అయితే దానిని అధికార దుర్వినియోగం గా చూపే ప్రయత్నం చేయడం తెలుగుదేశం ఎల్లో మీడియా అడుతున్న వికృత రాజకీయ క్రీడలో బాగంగా చూడవచ్చు.

రాష్ట్ర విభజనతో వెనుకబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోను మరీ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో చట్టపరంగా , న్యాయపరంగా అన్ని నిబందనలకు లోబడి పరిశ్రమను స్థాపించి ఆ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన చేస్తుంటే దానిని పై మరక వేసే ప్రయత్నం చంద్రబాబు చేయడం హేయమైన చర్యగా భూములిచ్చిన రైతులు చెప్పుకొచ్చారు. హెరిటేజ్ మజ్జిగ ని ప్రభుత్వం నుండి ఎక్కువ ధర కు కొని పంపిణి చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వానిది అధికార దుర్వినియోగం అవుతుంది కాని , కోర్టు అనుమతితో ఏర్పడుతున్న పరిశ్రమ ఎలా అధికార దుర్వినియోగం కింద వస్తుందో చంద్రబాబే సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also : కరోనా వర్సెస్‌ వాలంటీర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి