iDreamPost

కేంద్రం గుడ్‌న్యూస్‌.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

  • Published Sep 14, 2023 | 3:31 PMUpdated Sep 14, 2023 | 3:31 PM
  • Published Sep 14, 2023 | 3:31 PMUpdated Sep 14, 2023 | 3:31 PM
కేంద్రం గుడ్‌న్యూస్‌.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు కేంద్రం.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్‌ సిలిండర్‌ మీద భారీగా ధర తగ్గించిన సంగతి తెలిసిందే. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్లపై 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల పథకంలోని మహిళా లబ్ధిదారులకు, ఈ తగ్గింపు మొత్తం రూ.400కి పెంచింది. ఇక తాజాగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం లభించింది. దీని కింద కొత్తగా 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు.

ప్రస్తుతం 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ల పంపిణీ తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటుతుంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రారంభించిన కీలక పథకాల్లో ఉజ్వల పథకం ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న వెనకబడిన, పేద వర్గాల మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ అందించే పథకం ఉజ్వల. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రానున్న మూడేళ్లల్లో మరో 75 లక్షల మందికి కనెక్షన్లు పంపిణీ చేస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉజ్వల పథకం కింద కేంద్ర ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌లు అందిస్తుంది. దీనిలో భాగంగా ప్రతి కనెక్షన్‌కు ప్రభుత్వం 2,200 రూపాయల సబ్సిడీని ఇస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.1650 కోట్లు వెచ్చిస్తున్నారు. మొదటి సిలిండర్‌ను ఉచితంగా నింపడంతో పాటు ఉచితంగా గ్యాస్‌ స్టవ్‌ను అందించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని పెట్రోలియం కంపెనీలు భరిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి