iDreamPost

అవినీతి నిర్ములనే ధ్యేయం.. ఏసీబీ 14400 మొబైల్ యాప్‌ని ప్రారంభించిన సీఎం జగన్.. యాప్‌లో ఎలా కంప్లైంట్ ఇవ్వాలి??

అవినీతి నిర్ములనే ధ్యేయం.. ఏసీబీ 14400 మొబైల్ యాప్‌ని ప్రారంభించిన సీఎం జగన్.. యాప్‌లో ఎలా కంప్లైంట్ ఇవ్వాలి??

అవినీతి నిర్ములనే ధ్యేయంగా ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ ఈ యాప్‌ ని తయారు చేసింది. ఈ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నాం. ఎక్కడా అవినీతి ఉండకూడదు అని చెబుతున్నాం. దీనికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.41లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలాంటి అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపుతున్నాము అని తెలిపారు.

ఇక ఈ యాప్ గురించి మాట్లాడుతూ.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే చేయాల్సింది ఒక్కటే. తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి అందులో బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. దీంతో అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తున్నాం.

ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధించడంలో బాధ్యత ఉంది. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం మన మీద ఉంది. మన స్థాయిలో అనుకుంటే కేవలం 50శాతం అవినీతి మాత్రమే అంతం అవుతుంది. మిగిలిన అన్ని స్థాయిల్లో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని పాలన అందించడమే మన అందరి కర్తవ్యం. ఎవరైనా అవినీతి చేస్తూ పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని తెలిపారు.

 

ఏసీబీ 14400 మొబైల్ యాప్ ఎలా పనిచేస్తుందంటే…
#గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ ని డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
#ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే యాప్‌ ని వాడొచ్చు.
#యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి.
#యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌ రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
#లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించొచ్చు.
#ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది.

దీనిద్వారా ప్రజలు ఎక్కడినుంచైనా, ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగినా కంప్లైంట్ చేయొచ్చు అని అధికారులు తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి