iDreamPost

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

ఒక్కరోజులో 11,502 పాజిటివ్ కేసులు-386 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 325 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 11,502 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 325 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,32,424 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 9520 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,69,798 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,53,106 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 3,390 కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3390 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,07,958 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 3950 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 58,226 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 2,182 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 237 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 4974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2412 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 2377 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 185 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 294 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 6152 మందికి కరోనా సోకగా 84 మంది మృత్యువాత పడ్డారు. 3316 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2752 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 7,995,877 మందికి కోవిడ్ 19 సోకగా 435,598 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 4,112,262 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,162,228 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 117,858 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి