విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్ కిడ్నాప్ కు గురయ్యారు. రుషికొండలోని ఎంపీ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చోరబడి వీరిని ఎత్తుకెళ్లారు. మరోవైపు ఎంపీ సత్యనారాయణ ఆడిటర్ ను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లు రూ.50 కోట్లు డిమాండ్ చేశారు. అయితే ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఎంపీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. కిడ్నాప్ లో భాగంగా తొలుత ఎంపీ ఇంటికి చేరుకున్న దుండగులు ఎంపీ భార్యతో భయపెట్టి ఆడిటర్ జీవీకి ఫోన్ చేయించారు. అతడు వచ్చిన తరువాత ముగ్గురిని కలిపి కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారని సమాచారం ప్రాథమికంగా లేకపోయినా రౌడీ షీటర్ హేమంత్ మీద ఎంపీ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు జీవీ ఆడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక వ్యాపార గొడవలే కిడ్నాప్ కి కారణమా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.