iDreamPost

ప‌శ్చిమంపై త‌గ్గ‌ని ప్రేమ‌.. ఈసారి ప్ర‌భుత్వ విప్ అద‌నం..

ప‌శ్చిమంపై త‌గ్గ‌ని ప్రేమ‌.. ఈసారి ప్ర‌భుత్వ విప్ అద‌నం..

పశ్చిమ గోదావరి జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి క్లీన్‌ స్వీప్‌ చేసింది. కానీ.. 2019 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలోని ప‌దిహేను స్థానాల్లో టీడీపీకి కేవ‌లం రెండే స్థానాలు ద‌క్కాయి. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోనే సైకిల్‌ నిలబడింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవ‌డం.. వైసీపీ ప్ర‌భంజ‌నానికి గ‌తంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కనుసైగతో జిల్లాను శాసించిన వారు గప్‌చుప్ అయిపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి కీల‌కపాత్ర పోషించిన గోదావ‌రి జిల్లాల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆది నుంచీ ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తూనే ఉన్నారు. అన్నింట్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నారు.

కొత్త కేబినెట్ లో కూడా ఉమ్మ‌డి ప‌శ్చిమగోదావ‌రి జిల్లా లోని కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్‌ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్‌లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు మూడు మంత్రి పదవులతో పాటు, ఈసారి అదనంగా ప్రభుత్వ విప్‌ పదవిని కూడా అప్పగించారు.

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రియ)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పులు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్‌లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మాత్రమే కేబినెట్‌లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజికవర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్‌ దక్కలేదు.

అనుభ‌వానికి జై‘కొట్టు’

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, నిరంతరం ప్రజలను వెన్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అభివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్‌ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్‌ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీకాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.

పీసీసీ సభ్యునిగా, మెంబర్‌ ఆఫ్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్‌ ఆఫ్‌ హౌస్‌ కమిటీ ఇరిగ్యులారిటీస్‌ ఆఫ్‌ మిల్క్‌డైరీస్‌ సభ్యునిగా పనిచేశారు.గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్‌ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆయన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్‌ ఉన్నారు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్‌ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు.

కారుమూరి కోరిక నెరవేరింది..

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు.

2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్‌ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్‌ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ న్యూ అలుమ్‌నీ అసోసియేషన్‌ వెస్ట్‌ బ్రుక్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. వైఎస్సార్‌ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

విధేయతలో రా‘రాజు’

పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్‌ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు.

వైఎస్సార్‌ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాజు విధేయ‌త‌కు జ‌గ‌న్ ప‌ట్టంక‌ట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి