iDreamPost

TRAI: ఫోన్‌ నంబర్లపై ఛార్జీలు వసూలులో నిజమెంత.. ట్రాయ్‌ ఏం చెప్పిందంటే..

  • Published Jun 15, 2024 | 10:59 AMUpdated Jun 15, 2024 | 10:59 AM

ఫోన్‌ నంబర్లు, వినియోగంలో లేని సిమ్‌ కార్డుల మీద ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దీనిపై స్పందిస్తూ ట్రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

ఫోన్‌ నంబర్లు, వినియోగంలో లేని సిమ్‌ కార్డుల మీద ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో దీనిపై స్పందిస్తూ ట్రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Published Jun 15, 2024 | 10:59 AMUpdated Jun 15, 2024 | 10:59 AM
TRAI: ఫోన్‌ నంబర్లపై ఛార్జీలు వసూలులో నిజమెంత.. ట్రాయ్‌ ఏం చెప్పిందంటే..

ఒకప్పుడు మీడియాలో వచ్చే వార్తలు అంటే ఎంతో విశ్వసనీయత ఉండేది. అప్పట్లో మీడియా సంస్థలు కూడా విశ్వసనీయతకు పెద్ద పీట వేసేవి. అయితే ఇప్పుడు నడుస్తోంది సోషల్‌ మీడియా కాలం. ఏదో ఓ వార్త దొరికిందా.. వెంటనే దాన్ని షేర్‌ చేస్తూ.. వైరల్‌ చేస్తారు. అసలు అది నిజమా.. కాదా అని ఏమాత్రం ఆలోచించరు.. వార్త దొరికిందే సందు అని ఎడాపేడా లైక్‌, షేర్‌ చేస్తారు. ఆ తర్వాత ఆ వార్తకు సంబంధించిన కంపెనీలో, సంస్థలో, మనుషులో రంగంలోకి దిగి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అసలు వాస్తవాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్తపై కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా మీడియా, సోషల్‌ మీడియాలో ఫోన్‌ నంబర్లకు సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోన్న సంగతి తెలసిందే. తాజాగా దీనిపై ట్రాయ్‌ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఓ వార్త తెగ వైరల్‌ అవుతుంది. అది ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు కొత్తగా తీసుకునే నెంబర్లు, ల్యాండ్‌ లైన్‌ నంబర్లపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అలానే వాడకుండా నిరుపయోగంగా ఉన్న సిమ్‌లపై కూడా ట్రాయ్‌ జరిమానా విధించేందుకు రెడీ అవుతోంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో ఈ వార్తలపై తాజాగా ట్రాయ్‌ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్‌ నంబర్ల మీద ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రాయ్‌ ఖండించింది. కస్టమర్లు వాడుతోన్న ఫోన్‌ నెంబర్లకు సంబంధించి ఫీజులు వసూలు చేసే దిశగా తాము ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని ట్రాయ్‌ స్పష్టం చేసింది.

Sim cards

అయితే ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. ఫోన్‌ నెంబర్‌ వనరుల నియంత్రణ నిమిత్తం ట్రాయ్‌ ఇటీవల ‘రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరుతో ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ కారణంగానే ఫోన్ నంబర్లపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జరిగింది. మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. విషయం కాస్త ట్రాయ్‌ దృష్టికి చేరింది. ఈ క్రమంలో ఈ వార్తలకు చెక్‌ పెట్టే పనిలో పడింది ట్రాయ్‌. దీనిలో భాగంగా శుక్రవారం నాడు ఫోన్‌ నంబర్లపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పష్టత ఇస్తూ.. ఓ ప్రకటన విడుదల చేసింది ట్రాయ్‌.

దీనిలో కొన్ని మీడియా వర్గాల్లో వచ్చినట్లు, నంబరింగ్‌ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఫీజులు వసూలు చేయాలని ట్రాయ్‌ ప్రతిపాదన చేసింది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పింది. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవే అంటూ స్పష్టత ఇచ్చింది ట్రాయ్‌. ‘‘టెలీకమ్యూనికేషన్‌ ఐడెంటిఫైర్స్‌ వనరులపై పూర్తి నియంత్రణ కలిగిన టెలికాం శాఖ ఇటీవల ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌పై ప్రతిపాదనలు కోరింది. నంబరింగ్‌ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని అడిగింది. దీంతో మేం చర్చాపత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించాం’’ అని ట్రాయ్‌ స్పష్టం చేసింది. అంతేతప్ప ఫోన్‌ నంబర్ల మీద ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోవడం లేదు అని ట్రాయ్‌ స్పష్టం చేసింది. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి