ఏపీ కొత్త కేబినెట్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు పెద్దపీట వేశామని, పాత కొత్త మేలు కలయికతో కేబినెట్ ఉండనుందని వెల్లడించారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవం అని, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం తీసుకువచ్చామని ఆయన అన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం అని 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికి గాను 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఇవ్వగా 11 మంది ఓసీలకు మంత్రి పదవులు ఇచ్చామని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇన్ని మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వలేదని అన్నారు. అసలు చంద్రబాబు తొలి కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు చోటు దక్కలేదని, చంద్రబాబు రెండోసారి విస్తరించిన తర్వాత కూడా దిగిపోయే ముందు మాత్రమే ఎస్టీకి 4 నెలల ముందు చంద్రబాబు పదవి ఇచ్చాడని అన్నారు.
కానీ మేము 2019 తొలి కేబినెట్లో 5 మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చామని ఆ అందరిలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా ఇన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఈ వర్గాలకు ఇవ్వలేదని సజ్జల పేర్కొన్నారు. దేశ సామాజిక న్యాయచరిత్రలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం, నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం ఇచ్చిన తొలి ప్రభుత్వం వైయస్సార్సీపీనే అని ఆయన అన్నారు. అందులోనూ యాభైశాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మాదేనని అన్నారు. ఏఎంసీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, గుడి ఛైర్మన్లు అన్నీకూడా ఒక చట్టంచేసి మరీ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చిన ఘనత కూడా వైయస్.జగన్దే అని ఆయన అన్నారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ఇవికూడా చరిత్రాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని ఆ విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్తున్న వైయస్.జగన్ పునర్వ్యవస్థీకరణ ద్వారా మంత్రిమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 17 మందికి చోటు కల్పించారని అన్నారు.
మొత్తంగా 25 మందిలో వివిధ వర్గాలకు చెందిన 17 మందికి పదవులు ఇచ్చామని అన్నారు. బీసీలు ప్లస్ మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 పదవి ఇచ్చామని ఆ లెక్కన మంత్రిమండలిలో 70 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు వైయస్.జగన్ ఇచ్చారని అన్నారు. ఇది సామాజిక న్యాయంలో మహా విప్లవం అని, చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. 25 మందిలో ఓసీలు 8 మంది బీసీలు 11 మంది ( ఒక్క మైనార్టీతో కలుపుకుని), ఎస్సీలు – 5, ఎస్టీ –1 అన్నారు. అలాగే 2019 కేబినెట్లో మహిళలకు 3 అయితే ఇప్పుడు 4 స్థానాలు ఇస్తున్నామని అన్నారు.
చంద్రబాబు 2017లో చేసిన మంత్రివర్గ విస్తరణ చూస్తే ఓసీలు 13, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు – 12 ఉన్నారని అన్నారు. అంటే చంద్రబాబు హయాంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 12 కాస్తా.. 17కు పెంచాం అని, అంటే దాదాపు అప్పటికంటే.. 50శాతం పెంచామని అన్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అందుకే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నామని అన్నారు. ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవి బ్రాహ్మణుల వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అలాగే శాసనసభలో చీఫ్విప్గా ప్రసాదరాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పాత మంత్రులలో 11 మందిని కొనసాగించామని సజ్జల పేర్కొన్నారు.