iDreamPost

ప్రకాష్ రాజ్ ప్లాన్స్ భారీగా ఉన్నాయి

ప్రకాష్ రాజ్ ప్లాన్స్ భారీగా ఉన్నాయి

టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా టైం ఉంది కానీ ఎవరికి వారు గెలుపు కోసం, సభ్యులను ప్రసన్నం చేసుకోవడం కోసం తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. అందులో భాగంగా ప్రెస్ మీట్లు, మెంబర్స్ ని కలుసుకుని డిన్నర్లు గ్యాదరింగులు పెట్టేసుకుని తమ ఉద్దేశాలును స్పష్టం చేస్తున్నారు. మా అధ్యక్షుడిగా గెలిచి తీరతాననే ఆత్మవిశ్వాసాన్ని ముందు నుంచి ప్రదర్శిస్తున్న ప్రకాష్ రాజ్ ఏకంగా భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రెసిడెంట్ అయ్యాక చేస్తారా లేక కాకపోయినా చేస్తారా అనేది ఆసక్తికరం.

ఈ సందర్భంగా తాను ఇళయరాజాతో మాట్లాడితే 3 కోట్లు అడిగారని చెప్పి ప్రకాష్ రాజ్ చిన్నపాటి షాక్ ఇచ్చారు. కానీ అంత వ్యయాన్ని మోయలేనంటే చిత్ర, హరిహరన్ లాంటి గాయకులను తీసుకురావాలంటే కనీసం కోటి అయినా అవుతుందని ఆ మేరకు సిద్ధపడమని కూడా చెప్పారట. వెంటనే రాజా ముందే చిత్రకు ఫోన్ చేసిన ప్రకాష్ రాజ్ అక్కడిక్కడే ఆవిడ అంగీకారం తీసుకోవడం గమనార్హం. మా నిధుల కోసం చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చని ఆయన ప్లాన్ గా కనిపిస్తోంది. ఇదంతా జరిగితే బాగానే ఉంటుంది కానీ ఎంత వేగంగా జరగడం అన్నదే ముఖ్యం

ఇళయరాజాతో ఇంత చనువుగా డీల్ చేయడానికి ప్రకాష్ రాజ్ కు కారణాలు ఉన్నాయి. తాను దర్శకత్వం వహించి నిర్మించిన ఉలవచారు బిర్యానీ, ధోని, మా ఊరి రామాయణం సినిమాలకు సంగీతం అందించింది రాజానే. కొన్నేళ్ల క్రితం చెన్నైలో ఎండ్రెండుం రాజా అనే భారీ లైవ్ కన్సర్ట్ నిర్వహించినప్పుడు ప్రకాష్ రాజే వ్యాఖ్యాతగా నిలిచి దాన్ని విజయవంతం చేయడంలో మంచి పాత్ర పోషించారు. నిజంగా డిసైడ్ అవ్వాలే కానీ మళ్ళీ చేయడం అసాధ్యం కాదు. నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇళయరాజా లైవ్ ప్రోగ్రాం చేసినప్పుడు అంతగా సక్సెస్ కాలేదు. దానికి కారణాలు బోలెడు. ఈసారి అలా అయ్యే ఛాన్స్ లేదు లెండి

Also Read: అంచనాలు పెంచేస్తున్న సౌత్ దర్శకుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి