iDreamPost

కాంగ్రెస్‌ బలోపేతం కాదు నవ్వులపాలవుతోంది..!

కాంగ్రెస్‌ బలోపేతం కాదు నవ్వులపాలవుతోంది..!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా కనుమరుగైన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2014తోపాటు 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిని మార్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుడిని కూడా నియమించింది. అన్ని సామాజికవర్గాల నాయకులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతకుముందు కన్నా దిగజారిందని తెలుస్తోంది. పడుకున్న గుర్రాన్ని తట్టి లేపాల్సిన రౌతు.. ఆ పని చేయకపోగా గాఢ నిద్రలో ఉన్న మాదిరిగా ఏపీసీసీ అధ్యక్షుడు సాకే సైలజానాథ్‌ వ్యవహరిస్తున్నారని ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.

ఏ పార్టీ అయినా బలపడాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సునిశిత, సద్విమర్శలు చేయాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆ పని చేయకపోవగా.. అవగాహణ లేమితో చేస్తున్న విమర్శలు, డిమాండ్లతో ప్రజల్లో మరింత చులకనవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు సాకే సైలజానాథ్‌ కనీసం రోజు వారీ రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టడం లేదని ఆయన తాజాగా చేసిన డిమాండ్‌ను బట్టీ తెలుస్తోంది.

కోవిడ్‌ నిర్థారణ టెస్టును ప్రభుత్వమే ఉచితంగా చేయాలని సాకే డిమాండ్‌ చేశారు. అంతేకాదు కరోనా వైరస్‌ బాధితులకు చేస్తున్న చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడే సాకే పని తీరు తేటతెల్లం అవుతోంది. కరోనా ప్రారంభంలోనే వైసీపీ సర్కార్‌ అందుకు చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. అనుమానితులకు, పాజిటివ్‌ వ్యక్తులుకు చేసే చికిత్సకు ధరను కూడా నిర్ణయించింది. కరోనా చికిత్స అందించే ప్రవేటు ఆస్పత్రులకు ప్రత్యేకంగా ఆర్థిక ప్రొత్సాహకం కూడా ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రభుత్వమే కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేస్తోంది. పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందు వరుసలో నిలిచింది. దాని ఫలితమే రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణలో ఉందని ఐసీఎంఆర్‌ కూడా పేర్కొంది.

కరోనా పరీక్షలు, చికిత్స ఉచితంగా చేయడమే కాదు.. క్వారంటైన్‌లో ఉన్న వారు ఇళ్లకు వెళ్లే ముందు వారికి ఖర్చుల నిమిత్తం రెండు వేల రూపాయలు కూడా అందిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కరోనా విషయంలో వైసీపీ సర్కార్‌ ప్రజలు అన్ని విధాలుగా మేలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న పనులు నిత్యం తెలుగు మీడియాతోపాటు జాతీయ మీడియాలో కూడా వార్తలు, కథనాలు వస్తున్నాయి. కానీ సాకే సైలజానాథ్‌ ఇవేమీ చూసినట్లుగా లేరు. అందుకే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావలని డిమాండ్‌ చేసి ఆ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ అంతోఇంతో ఓటు బ్యాంకు ఉంది. కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారు. కానీ సమర్థవంతమైన నాయకత్వమే లేనట్లుగా సాకే పనితీరును బట్టీ అర్థం అవుతోంది. పార్టీ బలోపేతం సంగతి అంటుంచితే.. ప్రజల్లో నవ్వులపాలు కాకుండా రాజకీయాలు చేయడం ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అవసరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి