ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నేతలకు సంక్రాంతికి ముందే పదవుల పండగ వచ్చింది. జగన్ సర్కార్ నామినేటెడ్ పదవులు భర్తీకి సిద్ధమైంది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల మార్కెట్ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్ కమిటీ ఉండాలనే సూచనల మేరకు.. మార్కెట్ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. వీటిన్నింటికీ ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
216 కమిటీల్లో 50 శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చే విధంగా రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈ మేరకు మొత్తం 216 కమిటీల్లో 108 కమిటీలకు మహిళలు చైర్పర్సన్లుగా నియమితులు కానున్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులను మహిళలకు రిజర్వు చేస్తూ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చట్టం ఈ ఉత్తర్వుల ద్వారా ఆచరణలోకి రానుంది.
ఒక్కో మార్కెట్ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యకుడిగానూ, నలుగురు అధికారులు, ముగ్గురు వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగానూ ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని ప్రభుత్వం పెట్టుకుంది.
కొత్త ఏడాదిలో, సంక్రాంతికి ముందే రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు దక్కనున్నారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన నామినేట్ పదవులు.. రాష్ట్ర స్థాయి లోనివి. ఎమ్మెల్యేలు, ఆ స్థాయి ఉన్న వారికి అవి వరించాయి. మార్కెట్ కమిటీ పోస్టులు తో మొదటి సారిగా ద్వితీయ శ్రేణి నేతలకు భారీగా పదవులు దక్కనున్నాయి.