iDreamPost

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో క‌రోనా క‌ల‌క‌లం : మొత్కుప‌ల్లికి సీరియ‌స్..

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో క‌రోనా క‌ల‌క‌లం : మొత్కుప‌ల్లికి సీరియ‌స్..

క‌రోనా సెకండ్ వేవ్ అన్ని వ‌ర్గాల‌నూ క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. క‌రోనా బారిన ప‌డుతున్న రాజ‌కీయ నాయ‌కుల జాబితా పెరుగుతోంది. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా మారుతోంది. ఇటీవ‌ల టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (66) క‌రోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు కూడా క‌రోనా బారిన త‌న ఫామ్ హౌస్ లోనే చికిత్స పొందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల‌లో మ‌రి కొంత మంది నాయ‌కులు కూడా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. క‌రోనా పాజిటివ్ తో నాలుగు రోజుల క్రితం బీజేపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కూడా సోమాజిగూడ‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తాజాగా ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆయ‌న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా కూడా ఉన్నారు.

మోత్కుపల్లి తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన రాజ‌కీయ నాయ‌కుడు. మార్చి 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పటి నుంచీ ఆయ‌న ఎన్టీఆర్ తో కలిసి రాజకీయాల్లో న‌డిచారు. 1983 మరియు 2004 మధ్య ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీచేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఆయ‌న ఏకంగా ఆరుసార్లు ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప‌ని చేశారు. 2018లో ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Also Read : వెంకన్న దర్శనాలపై మళ్లీ కరోనా ప్రభావం

అనంత‌రం అదే సంవ‌త్స‌రం ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం రేపారు. తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీశ్రేణులు టీఆర్‌ఎస్‌లో కలిస్తేనే మంచిదని సూచించారు. తెలంగాణలో ప్రజలు టీడీపీకి రోజు రోజుకు దూరమవుతున్నారని మూడేళ్ల క్రిత‌మే ఆయ‌న చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌లో ఉన్న మంత్రులందరూ టీడీపీ నుండి వలస వెళ్లినవారేనని.. అలాంటప్పడు టీడీపీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ గౌరవంగా పార్టీ అంతరించిపోయే స్థాయికి చేరకముందు… కేసీఆర్‌ని ఒక మిత్రుడుగా భావించి పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తే ఎలాంటి వివాదాలు ఉండనవి చెప్పారు.

ఉమ్మడి ఏపీ విడిపోయాక.. చంద్రబాబు హామీ ఇచ్చిన గవర్నర్ పదవి ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడంతో ఆయనపై మోత్కుప‌ల్లి తీవ్ర విమర్శలు చేయ‌డం ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. 2018 నుంచీ చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పై అభిమానం ఒల‌క‌బోసేలా మాట్లాడారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఆ పార్టీ నుంచి పిలుపు రాలేదు.

మోత్కుపల్లి నవంబర్ 4,2019న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. నాగార్జున సాగ‌ర్ స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో మోత్కుప‌ల్లి పేరు కూడా ఉంది. కాక‌పోతే అంత యాక్టివ్ గా ఆయ‌న ప్ర‌చారంలో పాల్గొన‌లేదు. ఈ నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా సోకింది. నాలుగు రోజులుగా సోమాజిగూడ ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచి విషమంగా ఉండటంతో వైద్యులు మోత్కుపల్లిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం మరింత క్షిణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు నేతలు ఆస్ప‌త్రికి చేరుకుంటున్నారు.

Also Read : ఆపరేషన్ కమలం.. ముందే మొదలైన రిసార్టు రాజకీయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి