iDreamPost

తొలిసారిగా వెలుగులోకి వచ్చిన భక్త రామదాసు విగ్రహం.. వారసులకు అప్పగింత

  • Published Jan 27, 2024 | 11:56 AMUpdated Jan 27, 2024 | 11:56 AM

Bhakta Ramadasu Statue: భక్త రామదాసు పేరు తెలియని తెలుగు వారుండరు. శ్రీరాముడి ప్రియ భక్తుడిగా గుర్తింపు పొందడమే కాక.. ఆయన దర్శన భాగ్యం పొందిన వ్యక్తి.. రామదాసు. అయితే తాజాగా ఆయన విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Bhakta Ramadasu Statue: భక్త రామదాసు పేరు తెలియని తెలుగు వారుండరు. శ్రీరాముడి ప్రియ భక్తుడిగా గుర్తింపు పొందడమే కాక.. ఆయన దర్శన భాగ్యం పొందిన వ్యక్తి.. రామదాసు. అయితే తాజాగా ఆయన విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jan 27, 2024 | 11:56 AMUpdated Jan 27, 2024 | 11:56 AM
తొలిసారిగా వెలుగులోకి వచ్చిన భక్త రామదాసు విగ్రహం.. వారసులకు అప్పగింత

అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముందు నుంచి దేశంలో రామనామ జపమే వినిపిస్తోంది. వేడుక జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇంకా అయోధ్య వార్తలు, రాముడి విశేషాలు, మహిమలే వార్తల్లో నిలుస్తున్నాయి. ఇలా ఉండగా తాజాగా మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముడి ప్రియ భక్తుడిగా గుర్తింపు పొందిన శ్రీరామదాసు కంచర్ల గోపన్న విగ్రహాన్ని తొలిసారిగా గుర్తించారు. దాన్ని ఆయన వంశస్తులకు అప్పగించారు అధికారులు. భద్రాచలం ఆలయాన్ని భక్త రామదాసుగా గుర్తింపు పొందిన కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే ఆయన ఎలా ఉండేవారు.. ఆహార్యం ఏమిటనే దానికి సంబంధించి చరిత్రకారులుకు కూడా ఇప్పటి వరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఊహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు

అయితే ఇప్పుడు రామదాసు విగ్రహం వెలుగులోకి రావడంతో.. ఆయనకు సంబంధించిన అనేక అంశాల్లో ఓ స్పష్టత రానుంది. ఇంతకు రామదాసు విగ్రహం ఎక్కడ లభించింది అంటే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌ ఎదురుగా. ఎన్నో ఏళ్లుగా ఈ విగ్రహం అక్కడే ఉంది. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా దాన్ని కంచర్ల గోపన్న విగ్రహంగా గుర్తించారు అధికారులు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్‌ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఏదో పని నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించాడు. దాని గురించి పది రోజుల క్రితం చరిత్రకారులు రామోజు హరగోపాల్‌, కట్టా శ్రీనివాస్‌లకు తెలిపాడు. శ్రీనివాస్‌ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన చరిత్రకారులు.. పలు రకాల పరిశీలనల తర్వాత అది భక్త రామదాసు రూపమనే అంచనాకు వచ్చారు.

అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. విగ్రాహాన్ని పరిశీలిస్తే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది.

ఈ విగ్రహానికి రాజులకు ఉండే ఆహార్యం లేనందున.. అది అక్కన్న, మాదన్నలది కాదని.. వారి మేనల్లుడు భక్త రామదాసుదేనని చరిత్రకారులు వెల్లడించారు. ఇది సుమారు 17వ శతాబ్దానికి చెందిందని వారు తెలిపారు. ఇప్పటివరకూ ఈ పరిసర ప్రాంతాల్లో రామదాసు విగ్రహాలేవీ బయటపడలేదని వివరించారు.

దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించారు అధికారులు. ఆయన ఆ విగ్రహాన్ని శుద్ధిచేసి భక్త రామదాసు నివాస స్థలమైన ధ్యానమందిరానికి తీసుకెళ్లి సీతారామచంద్రుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. భద్రాచల దేవస్థానం, పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాన్ని నిర్ధారించాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి