iDreamPost

వారసుడు డేట్ మారింది – కథ సుఖాంతం

వారసుడు డేట్ మారింది – కథ సుఖాంతం

నెల రోజులకు పైగానే థియేటర్ల ఇష్యూలో కేంద్ర బిందువుగా నిలిచిన వారసుడు ఎట్టకేలకు విడుదల తేదీ మార్చుకుంది. జనవరి 14కి పోస్ట్ పోన్ చేస్తూ నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ కలిసి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు మంచి రిలీజ్ దక్కడం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఆ రెండు ట్రైలర్లకు వచ్చిన భీభత్సమైన రెస్పాన్స్ చూశాక వారసుడు లాంటి డబ్బింగ్ మూవీని మన ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడీ ప్రకటన రావడం విశేషం. వీటితో పాటు మరికొన్ని సంగతులు చెప్పారు.

వరిసు ఒరిజినల్ వెర్షన్ ముందు చెప్పిన ప్రకారం జనవరి 11నే తమిళనాడులో రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడున్న ఆన్ లైన్, సోషల్ మీడియా వల్ల రివ్యూలు టాక్స్ బయటికి వెళ్లే ప్రమాదం ఉన్నప్పటికీ కేవలం కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ రిస్క్ కి సిద్ధపడుతున్నట్టు చెప్పారు. కాంతార లాంటివి లేట్ రిలీజ్ లోనూ ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి దీనికీ అదే జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తారు. రిస్క్ ఉన్న విషయాన్ని మాత్రం ఒప్పుకున్నారు. అసలు తెలుగు ప్రమోషన్లకు రాడని పేరున్న విజయ్ ఈ మూడు రోజుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి.

మొత్తానికి ఈ ఒక్క పరిణామంతో స్క్రీన్ కౌంట్ లో విపరీతమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరసింహారెడ్డికి అతి పెద్ద ప్రయోజనం కలగనుంది. తెగింపుకి బజ్ తక్కువగా ఉన్న దృష్ట్యా దానికి సోలో రిలీజ్ దక్కినా అద్భుతాలు జరిగే అవకాశాలు తక్కువే. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఉపయోగమే కానీ చిరు బాలయ్యలు బరిలో దిగాక బిసి సెంటర్స్ లో జనాలు వేరే ఆప్షన్లు పెట్టుకోరు వీళ్ళను తప్ప. డేట్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్న దిల్ రాజు ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం ప్రేక్షకులనే కాదు ఇండస్ట్రీ వర్గాలనూ ఆశ్చర్యపరిచింది. ఏదైతేనేం అంతా మన మంచికే అన్నట్టు సంక్రాంతి బాక్సాఫీస్ కు ఇది శుభ పరిణామమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి