iDreamPost

తిరుపతి ఉప ఎన్నిక : ముందే చేతులెత్తిసిన అచ్చెం నాయుడు

తిరుపతి ఉప ఎన్నిక : ముందే చేతులెత్తిసిన అచ్చెం నాయుడు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, యవనేత నారాలోకేష్‌ కూడా రంగంలోకి దిగారు. ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

అయితే ఓ వైపు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు మరో వైపు పరోక్షంగా ఓటమిని ఒప్పుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు చెబుతున్నారు. ఈ మాటతోనే తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై టీడీపీ నేతల అంచనాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.

ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలకడం, పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ ఢీలా పడడం, ఫలితాల తర్వాత ఆ ప్రస్తావనే తేకపోవడం.. ఇదీ ఇటీవల కాలంలో టీడీపీ అనుసరిస్తున్న విధానం. పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీ నేతలు చేసిన ఆర్భాటం మాటల్లో వర్ణించలేం. ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రచారం చేసిన సమయంలో వైసీపీ గెలిస్తే రాజధానిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు చంద్రబాబు. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత ఈ విషయంపై చంద్రబాబు నోరుమెదపలేదు.

Also Read : విలీనంపై నోరు మెదపరెందుకు బాబూ..?

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని గతంలో చంద్రబాబు అండ్‌ కో డిమాండ్‌ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. వైసీపీ గెలిస్తే మూడు రాజధానులను పెట్టుకోవచ్చన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో అవకాశం వచ్చినా.. ఆ ఎన్నికల్లో అమరావతి పేరును, మూడు రాజధానుల ప్రస్తావనను చంద్రబాబు అండ్‌ కో ఎక్కడా ప్రస్తావించలేదు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు వేర్వేరుగా విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ అమరావతి ప్రస్తావన లేదు.

ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాయలసీమలో కర్నూలు కేంద్రంగా న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. మరి మూడు రాజధానులకు ఈ ఎన్నికలు రెఫరెండంగా టీడీపీ తీసుకోవచ్చు. గతంలో చంద్రబాబు అండ్‌ కో అన్నట్లుగా.. మూడు రాజధానులు పెట్టి.. బంగారుబాతు లాంటి అమరావతిని వైసీపీ చంపేస్తుందన్న మాటలను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం లేదు.

అమరావతిలో ఒక మాట. విశాఖలో మరో మాట, రాయలసీమలో ఇంకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు అసలు రూపాన్ని ప్రజలు గుర్తించారు. అందుకేనేమో టీడీపీ నేతలు ముందే ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఫలితంపై అన్ని పార్టీలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు తేలాల్సింది రెండో స్థానంలో నిలిచేది ఎవరనే.

Also Read : చంద్రబాబు కు తిరుపతి గ్రాండ్ ఫెయిల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి