Idream media
Idream media
ఏపీలోని సచివాలయ వ్యవస్థ మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. అవార్డులు, అభినందనలే పనితీరుకు గీటురాయి. ఆ వ్యవస్థ గొప్పతనానికి కొలమానాలు. ఇప్పుడు అలాంటి అభినందనలనే ఏపీ పొందుతోంది. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత ఏపీలో పైరవీలకు తావులేని పాలన అందుతోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. సందర్భమైనా, అసందర్భమైనా సచివాలయ వ్యవస్థపై ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంది. ఎన్నికల వేళ అది మరింత శృతి మించేలా వ్యవహరించింది. అయినప్పటికీ ఆ వ్యవస్థ ఉద్యోగులు, సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు విశిష్ఠ సేవలందించి ప్రశంసలు పొందుతున్నారు. ఆ వ్యవస్థ చేపడుతున్న చర్యలు కారణంగా గ్రామాల్లో స్వరాజ్యం కనిపిస్తోంది.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావానల్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుబాటులో ఉన్నాయి. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ..ఆరోగ్యం కానీ.. రెవెన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. వ్యవసాయం కానీ.. ఉద్యానవనాలకు సంబంధించిన సమస్యలు కానీ.. మార్కెట్ కానీ.. పశు సంరక్షణ కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంట్లోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.
1,61,169 మంది గ్రామ సచివాలయ సిబ్బంది, 2,46,772 మంది గ్రామ వలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ముంగిటకే వెళ్లి వారి అవసరాలు తీర్చుతున్నారు. వీటన్నింటి ఫలితంగా గ్రామాల్లో పాలన వికసిస్తోంది. ప్రజలందరూ భరోసాతో జీవిస్తున్నారు. తమకు ఏ సమస్య/అవసరం ఉన్నా సచివాలయానికి వెళ్తే చాలనే భావన ఏర్పడింది. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య లేకుండా దాదాపు సేవలు అందుతున్నాయి. ఎక్కడైనా పొరపాటు జరిగినా వెంటనే లోపాలను గుర్తించి సచివాలయ సిబ్బంది సరి చేస్తున్నారు. ఫలితంగా ప్రతీ లబ్ధిదారుడి ముఖంలో చిరునవ్వు వికసిస్తోంది.
ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలను ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవడంతో అవార్డుల పంట పండుతోంది. ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులు దక్కాయి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే సమావేశంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయని, ఏపీకే అత్యధిక అవార్డులు వచ్చాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించడం ఆ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది.
Also Read : కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం భరోసా ఇచ్చింది