iDreamPost

కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజులో 17,296 పాజిటివ్ కేసులు

కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజులో 17,296 పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 17,296 పాజిటివ్ కేసులు – 407 మరణాలు

కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 15 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 17,296 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,90,401 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 15,301 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 407 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 2,85,63 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,89,463 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో ఆగని కరోనా విజృంభణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 4842 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,47,741 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 6,931 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 70,878 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 4062 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 920 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 11364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6446 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 4688 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 230 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 553 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 10,884 మందికి కరోనా సోకగా 136 మంది మృత్యువాత పడ్డారు. 4988 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5760 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 9,710,205 మందికి కోవిడ్ 19 సోకగా 491,783 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 5,279,579 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,504,588 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 126,780 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి