రాజకీయాలకు కాదేదీ అనర్హం.. అన్నది అక్షరాలా రుజువవుతోంది. చావు, పుట్టుక, ఎండ, వాన, మతం, కులం, విందు, వినోదం… ఇలా ప్రతీదీ ఏపీలో పొలిటికల్ టాపిక్ గా మారుతోంది. భీమ్లానాయక్ సినిమానే తాజా నిదర్శనం. జగన్ సర్కారు నిబంధనల ప్రకారం.. అందరితోనూ నడుచుకున్నట్లే వ్యవహరించినా, అందులో హీరో పవన్ కళ్యాణ్ కావడంతో విపక్షాలకు కొత్తఅంశం దొరికింది. ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ మిత్రపక్ష పార్టీలైనప్పటికీ ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినిమాని కూడా రాజకీయాలకు వాడుకునేందుకు సిద్ధమైన టీడీపీ.. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా పై ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మాటల తూటాలు పేల్చారు.
పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పదేపదే ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై చర్చలు నిర్వహిస్తున్నాయి. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ తొక్కేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సినిమాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.. ఒక సినిమా రిలీజ్ ఉంటే దానికోసం తండ్రి, కొడుకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమాటికెట్ ధరలను అధిక ధరలకు అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టాల్సిన వారు ప్రోత్సహిస్తున్నారు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరంటూ ప్రశ్నించారు.
అంతేకాదు టీడీపీ జెండాను మోసిన జూ.ఎన్టీఆర్ సినిమాను ఏనాడైనా చంద్రబాబు, లోకేష్ లు పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు.మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోయిన బాధలో మేమున్నాం.. జీవో రావడం రెండు రోజులు ఆలస్యమైందని రచ్చ చేస్తున్నారు.. ప్రభాస్, మహేష్, చిరంజీవి సినిమాలకు ఎప్పుడైనా చంద్రబాబు.ట్వీట్ చేశారా.. మరి ఇప్పుడు పవన్ సినిమా చూడాలంటూ ఎలా లోకేష్ ట్వీట్ చేస్తారు.. మేము ఇలాంటి రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నాం అని పేర్ని నాని చెప్పారు. సినిమా బాగుంటే ఎవరు హీరో అయినా చూస్తారు. నాగార్జున తనయుడు నాగచైతన్య తీసిన రెండుసినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి బాగున్నాయి కనుక ప్రేక్షకులు ఆదరించారు… కనుక సినిమాలో దమ్ము ఉంటే బాగా ఆడతాయి. లేదంటే మరో సర్దార్ గబ్బర్ సింగ్, లేదా అజ్ఞాత వాసి అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.
నన్ను అఖండ సినిమా రిలీజ్ సమయంలో బాలకృష్ణ కలవడానికి కొంతమందిని పంపించారు. సీఎం జగన్ తో అపాయింట్మెంట్ ఇప్పించమని కోరారు. ఇది అబద్దమైతే.. ఆయన్ని చెప్పమని అనండి.. నేను అయితే బాలకృష్ణ అబద్దాలు చెబుతారని అనుకోవడంలేదని చెప్పారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబునాయుడివి అన్నీ దిక్కుమాలిన రాజకీయాలు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి పేర్ని నాని. జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పులన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్కలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతోంది.. లీగల్ ఒపీనియన్ కి వెళ్ళింది..అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24 తేదీన జీవో రావాల్సి ఉందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు, సినిమాని ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోలేరా..జీవో వచ్చే వరకూ ఆగలేరా..? ఏపీలో సినిమాని ప్రీ గా చూపిస్తాను అన్న పవన్ కు బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకన్నారు నాని. అసలు జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు.. బాగుంటే అందరి సినిమాలు చూస్తారని మంత్రి నాని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో నందమూరి హీరోల చిత్రాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతూ పేర్ని చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.