Idream media
Idream media
ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ రత్నప్రభను ప్రకటించిన వెంటనే జనసేన నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఇందుకు కారణం అంతకు ముందే తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పవన్ మాట్లాడడమే. అయితే, ఆ తర్వాత బీజేపీ నాయకులు రత్నప్రభను తీసుకెళ్లి పవన్కల్యాణతో మాట్లాడించిన అనంతరం జనసేన స్పందించింది. రత్నప్రభను బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తావిస్తూ, ఉపఎన్నిక ప్రచార వ్యూహంపై రెండు పార్టీల నేతలు చర్చించినట్టు జనసేన ప్రకటించింది. రత్నప్రభ నామినేషన్ కు జనసేన అధినేత పవన్ వస్తారని ఊహాగానాలు నడిచాయి. అయితే, ఆయన వెళ్లలేదు. ఇప్పటి వరకూ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో బీజేపీని గెలిపించాలని జనసేన నుంచి గానీ, ఆ పార్టీ నాయకుల నుంచి గానీ ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. దీంతో తిరుపతిలో బీజేపీకి జనసేన మనస్ఫూర్తిగా సహకరిస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ – జనసేన మైత్రీ బంధం మొదటి నుంచీ తెలుగురాష్ట్రాలలో ఆసక్తికరంగానే మారింది. కేంద్ర నాయకత్వం తమను గుర్తిస్తున్నా, రాష్ట్ర నాయకత్వాలు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ స్వయంగా పలు మార్లు ప్రకటించారు. అనంతరం తెలంగాణకు చెందిన బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పవన్ తో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్ తో కలిసి చర్చించారు. అయినప్పటికీ బీజేపీ, జనసేనల మధ్య తెలియని గ్యాప్ ఉందని అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలు, ఇటీవల తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు ఆ అనుమానాలను నిజం చేశాయి. తెలంగాణ బీజేపీ నేతల వినతి మేరకు గ్రేటర్ హైదరాబాద్ పోరు నుంచి తప్పుకున్న జనసేన ప్రచారంలో మాత్రం పాల్గొనలేదు. ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా జనసేన తిరుపతి లోక్సభ సీటును ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అది కూడా జరగలేదు. ఈ పరిణామాలన్నీ జనసైనికులకు రుచించడం లేదు.
ఇదిలా ఉండగా, తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనాని బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. మిత్రపక్షం బీజేపీకి కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణికి మద్దతు ప్రకటించారు. అందుకు పలు కారణాలను ఆయన చెప్పుకొచ్చారు. పీవీపై ఉన్న అభిమానంతో అని ప్రకటించినా అంతర్లీనంగా అది మాత్రమే కారణం కాదు. పవన్ కల్యాణ్ నిర్ణయం బాధపెట్టిందని స్వయంగా బండి సంజయ్ వెల్లడించారు. ఈ పరిణామాలు చూసిన తర్వాత తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన మిత్రపక్షం దారెటు అన్న చర్చ నెలకొంది. వాస్తవానికి తిరుపతిలో తమకు మంచి బేస్ ఉందన్నది జనసేన నేతలు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు.
గతంలో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందడంతోపాటు ఈ లోక్సభ పరిధిలో బలిజకాపు సామాజికవర్గం ఎక్కువ. ఇవన్నీ ప్లస్ అవుతాయన్న భావనతో ఉపఎన్నికలో పోటీకి జనసేన ఆసక్తి చూపించింది. ఒకానొక దశలో తిరుపతి సీటు విషయంలో బీజేపీపై నేరుగా విమర్శలు చేశారు జనసేన నాయకులు. ఇటీవల ఏపీలో ముగిసిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీల పొత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి. బీజేపీ కారణంగానే జనసేన చాలాచోట్ల ఓడిపోయిందని బహిరంగ విమర్శలు చేశారు జనసేన నేతలు. ఇవన్నీ చూసిన వారి దృష్టి సహజంగానే తిరుపతిపై పడింది.
ప్రస్తుతం తిరుపతి హోరాహోరీ పోరులో ప్రస్తుతం బీజేపీ కాస్త వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తోంది. హడావిడి పెద్దగా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. ప్రచారంలో పాల్గొనాలని స్థానిక జనసేన నాయకులకు, కార్యకర్తలకు స్వయంగా చెప్పాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే పవన్ ప్రచారంపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతకంటే ముందుగానే రత్నప్రభను గెలిపించాలని వాయిస్ మెస్సేజ్ విడుదల చేయాలని కోరారట. దీనిపై జనసేన నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో చూడాలి. ఎంత త్వరగా ప్రకటన వస్తుందో వేచి చూడాలి.