వీర‌ప్ప‌న్ కుమార్తెకు బీజేపీ కీల‌క హోదా…

దేశంలో పేరు మోసిన బందిపోటు అత‌డు. రెండు రాష్ట్రాల పోలీసుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గ‌జ దొంగ‌. స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్. ఆమె కుమార్తె మాత్రం కొత్త భ‌వితకు శ్రీ‌కారం చుట్టారు. రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డి సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరారు. వీరప్పన్‌ మరణానంతరం తల్లి ముత్తులక్ష్మి ఆలనాపాలనలో విద్యావంతురాలిగా మారిన విద్యారాణి రాజకీయాల వైపు మొగ్గు చూపారు. కృష్ణగిరిలో జరిగిన బహిరంగ సభలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వీరప్పన్ కుమార్తెను తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నియ‌మించింది. రాజ‌కీయాల్లో కొత్త శ‌కానికి నాంది ప‌లికింది. గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

వృత్తి న్యాయ‌వాది.. ప్ర‌వృత్తి ప్ర‌జా సేవ‌..

వీర‌ప్ప‌న్ కుమార్తె విద్యావంతురాలు. లా చ‌దివారు. న్యాయ‌వాద వృత్తిని చేప‌డుతున్నారు. పేద‌ల త‌ర‌ఫున ప‌ని చేస్తున్నారు. తండ్రి దొంగ‌గా గుర్తింపు పొందినా విద్య మాత్రం చిన్న నాటి నుంచి త‌ల్లి సంర‌క్ష‌ణ‌లోనే మంచి న‌డ‌వ‌డిక‌తో పెరిగారు. ప్ర‌స్తుతం పేద పిల్ల‌ల కోసం ఆమె ఉచితంగా పాఠ‌శాల‌ను కూడా న‌డుపుతున్నారు. ప్ర‌జా సేవ చేయాల‌న్న కోరిక‌తో రాజ‌కీయాల వైపు మొగ్గు చూపారు. గత ఫిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. అప్ప‌టి నుంచీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా ఆమెను బీజేపీ యువ‌జ‌న విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా నియ‌మించ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై భిన్న వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని క‌ట్ట‌బెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Show comments