రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ ముందే ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా అలాగే స్పందించి ఔరా అనిపించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టారు. వారికి ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకుండా చూశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన ప్రకటనతో ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేయాలని తెలుగుదేశం భావించింది. దీన్నొక ఆయుధంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఏదో చేయాలని తెగ ఆరాట పడ్డారు. దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలని, మోదీ తో మాట్లాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక్కడి వరకూ ఓకే కానీ.. కేంద్ర ఆధీనంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రానికి చెందిన జగన్ కొట్టేయాలని చూస్తున్నారట. ఇటువంటి ప్రకటనల ద్వారానే 40 ఏళ్ల రాజకీయ అనుభవ శాలి కాస్తా.. రాజకీయ అజ్ఞానిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అంతేకాదు ప్రత్యక్షంగా 18 వేల మంది శాశ్వత ఉద్యోగులకు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, పరోక్షంగా లక్ష మంది కి పైగా ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి ? అని ప్రశ్నించిన వారికి తన బాధ్యత నెరవేరుస్తూ జగన్ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యుద్ధం ప్రకటించారు. ఎంపీలు కేంద్రంపై పోరాటానికి సిద్ధమైతే విశాఖ ఎమ్మెల్యేలు దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం జగన్ మోదీకి లేఖ రాయడంపై రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏదీ ముఖ్యం కాదనే సందేశాన్ని జగన్ చాటారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం లేఖ రాశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని మోదీని లేఖ ద్వారా కోరారు.
ప్లాంట్ ప్రగతికి కేంద్రానికి సూచనలు
విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్ఫ్యాక్టరీ వచ్చింది. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్స్టీల్ మంచి పనితీరు కనపరిచింది. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయి. స్టీల్ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చు.. అంటూ కేంద్రానికి సూచించారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబర్ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే… ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్స్టీల్స్కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్కు ఉన్నాయి. వైజాగ్ స్టీల్స్కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చు.స అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోమని చెప్పడమే కాదు.. ప్లాంట్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను, నష్టాలకు గల అవరోధాలను కూడా వెలుగులోకి తెచ్చి చిత్తశుద్ధిని చాటారు.