iDreamPost

ఉద్యోగం కోల్పోయినా పరాగ్ అగర్వాల్‌దే విజయం.. కారణం ఇదే..

ఉద్యోగం కోల్పోయినా పరాగ్ అగర్వాల్‌దే విజయం.. కారణం ఇదే..

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ట్విట్టర్‌ని హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. సుదీర్ఘ చర్చలు, వివాదాలు, న్యాయ ప్రక్రియ తర్వాత 44 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పూర్తి చేశారు. అయితే, ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆయన నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ క్రమంలో యజమానిగా సంస్థ ప్రధాన కార్యాలయంలోకి అడుగు పెట్టిన తొలిరోజే పలువురు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దెలను తొలగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీరిని సంస్థ నుంచి తొలగించడంతో పరిహారంగా వారికి ట్విట్టర్ తరఫున మస్క్ 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600 కోట్లు) కంటే ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.

ఇందులో అగర్వాల్ అధిక మొత్తం పరిహారం అందుకోనున్నారు. గతేడాది నవంబర్ లో పరాగ్ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పుడే పరిహారాన్ని ఖరారు చేశారు. ఎందుకంటే ఆయన ‘గోల్డెన్ పారాచూట్’ నిబంధనతో ఒప్పందంపై సంతకం చేశారు. ట్విటర్‌తో ఒప్పందంలో భాగంగా ఏడాదికంటే ముందే ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆయనకు దాదాపు 42 మిలియన్ల (సుమారు రూ. 344 కోట్లు) పరిహారం ఇవ్వాలి. అయితే, టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన తర్వాత మస్క్ వారికి పరిహారం చెల్లించకుండా నిరోధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మస్క్ పై న్యాయ పోరాడానికి దిగే ఆస్కారం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి