TS Free Treatment In Palliative Care Centers:మంచానికే పరిమితమైన వారికి తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. ఏడాదంతా ఫ్రీగా

మంచానికే పరిమితమైన వారికి తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. ఏడాదంతా ఫ్రీగా

దీర్ఘకాలిక రోగాల బారిన పడి.. మంచానికే పరిమితం అయ్యి.. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న వారిని చూసుకోవడం ఎంత కష్టమో.. అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రత్యేకంగా మనిషి పెట్టుకోవాలంటే.. ఆర్థికంగా భారం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అదించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొత్త ఆసుపత్రులు, అంబులెన్సులు, ల్యాబ్ టెస్టులు ఇలా అనేక సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా.. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ జీవిత చరమాంకంలో.. మచానికే పరిమితం అయి ఉన్న రోగులను ఆదుకునేందుకు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి వైద్య సేవలు అందించేందుకు ‘ఆలన’ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఇంట్లో మంచానికే పరిమితమైన రోగులకు ఆలన కేంద్రాలు (పాలేటివ్‌ కేర్‌) ద్వారా చికిత్స అందించిలే చర్యలు తీసుకుంది తెలంగాణ సర్కార్‌. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయిన వారిని ఆలన కేంద్రాల్లో చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెడ్‌హిల్స్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఆరు పడకలతో ఆలన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా గడ్డిఅన్నారంలోనూ ఆరు పడకలతో మరో కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ కేంద్రాల్లో ఓపీ, ఐపీ, హోమ్‌కేర్‌ సేవలు ఫ్రీగా అందించనున్నారు.

365 రోజులు 24 గంటలపాటు వైద్యం..

ఇలా మంచానికే పరిమితం అయిన వారు.. కుటుంబాలకు భారం కాకుండా.. ఉండేలా.. వారిని ఆలన కేంద్రాల్లో చేర్చితే.. ఇక్కడ రోగులకు అన్ని రకాల చికిత్సలు ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రాల్లో డాక్టర్‌తోపాటు, ఫిజియోథెరపిస్టు, స్టాప్‌ నర్సులు, ఆయాలు కూడా ఉంటారు. ఇక ఈ కేంద్రాల్లో.. ఏడాది పొడవునా అనగా.. 365 రోజులు 24 గంటలపాటు వైద్య స్బిబంది అందుబాటులో ఉంటారు. రోగులకు, వారి సహాయకులకు ఉచిత వసతి, భోజనం, మందులు, ఫిజియోథెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటి వెల్లడించారు. అంతేకాక పాలేటివ్‌ కేంద్రాల వద్ద అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంటాయన్నారు. బాధితులను ఈ కేంద్రాలకు తరలించడానికి వీటిని వినియోగించుకోవాలన్నారు.

ఇంటికి వెళ్లి ఉచిత సేవలు..

ఇక ఈ కేంద్రాలకు రాలేని వారికి.. ఏకంగా ఇంటికే వెళ్లి ఉచితంగా చికిత్సలు అందిస్తామని చెప్పారు. సేవలు అవసరమయ్యే వారు సమీపంలోని బస్తీ దవాఖానా లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. అవసరమైతే నగరంలో మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని డాక్టర్ వెంకటి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలన కేంద్రాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఓ వ్యక్తి మంచానికి పరిమితమైతే…ఆ ప్రభావం మిగతా కుటుంబ సభ్యులపై పడుతుందని.. ఆర్థిక స్తోమత లేని రోగుల పరిస్థితి వర్ణణాతీతామని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అలాంటి వారికి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.

Show comments