‘పవన్ కళ్యాణ్ చాలా రిజర్వ్డుగా వుంటారు..’ అనే అభిప్రాయం చాలామందిలో వుంది. అది నిజం కూడా. కానీ, ఆయనతో పరిచయం ఏర్పడితే మాత్రం.. ఎవరైనా చాలా ‘దగ్గర’ అయిపోతారట. ఈ మాట చాలా కొద్దిమంది చెబుతుంటారు. పవన్ తన సినిమాల్ని తాను ప్రమోట్ చేసుకోవడానికే ఇష్టపడరు. అయితే, ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం మాత్రం కాస్త మారారు. అది గతం. రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ ఇంకా రిజర్వ్డ్ అయిపోయారు. కానీ, రవితేజ, నితిన్.. ఇలా కొంతమంది సినిమాల ప్రమోషన్ కోసం ఆయా సినిమాల ఈవెంట్స్కి పవన్ హాజరైన విషయం విదితమే. ఇదిలా వుంటే, పవన్ తన పుట్టినరోజునాడు తనకు అందిన విషెస్కి రిప్లయ్స్ ఇస్తూ వున్నారు. అందరికీ కలిపి ఒకే రిప్లయ్ కాకుండా, విడివిడిగా రిప్లయ్స్ ఇవ్వడం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటిదాకా టాలీవుడ్కి సంబంధించి ఇలా ఎవరూ స్పందించింది లేదు. ‘పవన్ కళ్యాణ్ మారిపోయిన మనిషి..’ అని ఇప్పుడు చాలామంది అంటున్నారు. అయితే, పవన్ ఇప్పటిదాకా ఇలాంటివి పబ్లిసిటీకి దూరంగా చేసేవారు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తున్నారన్నది మరికొందరి వాదన. ఎవరి వాదన ఎలా వున్నా, కమెడియన్ ధనరాజ్ లాంటివారికి కూడా పవన్ రిప్లయ్ ఇవ్వడమంటే గొప్ప విషయమే. పవన్ నుంచి రిప్లయ్ అందుకుంటున్న వారే కాదు, పవన్ అభిమానులూ ఆశ్చర్యపోతున్నారు పవన్లోని ఈ మార్పుని చూసి.