Idream media
Idream media
అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్పోస్టులను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, చెక్పోస్టులను తొలగించడంలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కరోనా నోడల్ అధికారి కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. చెక్పోస్టుల తొలగింపుపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేనది ఆయన వెల్లడించారు. కోవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్పోస్టులను నిర్వహిస్తున్నట్లు కృష్ణ బాబు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రవేశాలను మరికొన్ని రోజుల పాటు నియంత్రిస్తామని కృష్ణబాబు తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలోకి రావాలంటే స్పందన వెబ్సైట్లో తప్పకుండా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. కరోనా అధికంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు సహా మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారు వారం రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తెలిపారు.
అంతర్రాష్ట్ర ఆర్టీసీ సేవలపై ఇంకా క్లారిటీ రాలేదని కృష్ణబాబు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా సహా ఆరు రాష్ట్రాలకు బస్సులను తిప్పే విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖలు రాశారు. ఈ విషయంపై ఆయ రాష్ట్రాలు ఇంకా స్పందించలేదు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి లభించిన వెంటనే బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణబాబు తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి ఏపీకి సర్వీసులు నడుపుతామని వెల్లడించారు.