SNP
SNP
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్పై విమర్శలు, సమర్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై ఏకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్ స్టో అవుట్ విషయంలో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. ఇలాంటి పద్ధతిలో ఇంగ్లండ్ మ్యాచ్ గెలవాలని తాను కోరుకోవడం లేదని ఆస్ట్రేలియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటి?
ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్ స్టో వికెట్ కీపర్ చేతిలో బంతి ఉండగానే ఓవర్ పూర్తి కావడంతో క్రీజ్ నుంచి బయటకి వచ్చాడు. కానీ కీపర్ మాత్రం వికెట్లకు త్రో వేయడంతో అంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించాడు. రూల్స్ ప్రకారం అది అవుటే అయినా.. ఆస్ట్రేలియా టీమ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. బెయిర్ స్టో రన్ కోసం ప్రయత్నించకపోయినా రనౌట్ చేయడంపై క్రికెట్ అభిమానులు సైతం ఆసీస్ను తప్పుబడుతున్నారు.
ప్రధాని స్పందించాల్సిన అవసరం ఉందా?
అయితే ఈ విషయంపై గత రెండు రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. చాలా వరకు ఆస్ట్రేలియాదే తప్పనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ ఆస్ట్రేలియా మీడియా మాత్రం ఇంగ్లండ్పై ఎదురుదాడికి దిగింది. క్రికెట్ ఆడలేక ఇలా చిన్నపిల్లలా ఏడుస్తున్నారంటూ విమర్శించింది. ‘ఇలా ఆసీస్లా ఆడి, మేం మ్యాచ్ గెలవాలి అనుకోవడం లేదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ చేసిన కామెంట్స్ను సైతం ఆసీస్ మీడియా హేళన చేసింది. దీంతో ఈ విషయంపై ఏకంగా ప్రధాని స్పందించాల్సి వచ్చింది. మరి బెయిర్ స్టో రనౌట్ వివాదం, ప్రధాని రిషి స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.