పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ను ముంచింది ఎవరు సార్.. ?

  • Published - 04:44 AM, Tue - 2 February 21
పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ను ముంచింది ఎవరు సార్.. ?

జల ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేసిందో చెప్పడానికి సోమవారం సుప్రీంకోర్టు పురుషోత్తమపట్నం విషయంలో ఇచ్చిన తీర్పే నిదర్శనం. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లను పిలిచిన నాటి టీడీపీ ప్రభుత్వం నానా హడావుడి చేసి వందల కోట్ల రూపాయలకు గండికొట్టి జేబులు నింపుకోవాలని చూసింది. ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేని పురుషోత్తమపట్నం ప్రాజెక్టుతో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు దండుకోవడానికి చూసారు అన్నది సుప్రీం తీర్పు ద్వారా అర్థం అవుతుంది.

వైయస్సార్ హయాంలో తవ్విన పోలవరం కుడి కాలువ మీద మోటార్లు బిగించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ నదుల అనుసంధానం అంటూ నానా హడావుడి చేసి వందల కోట్లు దండుకుని, తమ అనుకూల మీడియాలో అపర భగీరథుడు అంటూ పట్టిసీమ తాను సృష్టించిన మహానది అని చంద్రబాబు ప్రచారం చేయించుకున్నాడు.

పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామని, రాసిపెట్టుకోమని ప్రగల్భాలు పలికిన నాటి టిడిపి ప్రభుత్వం పోలవరం కుడి ఎడమ కాలువల కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వటానికి పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులు మొదలు పెట్టడం రైతులను మోసం చేయడమే. ఈ ప్రాజెక్టులన్నీ తానే తీసుకు వచ్చాను అని చెప్పుకోవడానికి, ఆ ప్రాజెక్టుల మాటున అయినవారికి టెండర్లు కట్టబెట్టి భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారన్నది లోకమెరిగిన సత్యం.

పురుషోత్తమపట్నం ప్రాజెక్టు మొత్తం టిడిపి హయాంలో రూపుదిద్దుకున్నది. గోదావరి నుంచి సుమారు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం ఎడమ కాలువ ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి మళ్ళించాలనేది ప్లాన్. 1638 కోట్లు వ్యయం అంచనా. అంటే అప్పటికే పూర్తయిన పోలవరం ఎడమ కాలువలో నీళ్లు ఎత్తిపోయటమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. కాలువలోని 48 వ కిలోమీటర్ దగ్గర నుంచి నీటిని ఎత్తి పోసి ఏలేరు రిజర్వుయర్ లోకి నింపుతారు.

అయితే పోలవరం ప్రాజెక్ట్ 2018 చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం 2016 లో ఈ పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ను ఎందుకు మొదలు పెట్టిందన్నది అసలైన ప్రశ్న. అచ్చం పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ వందల కోట్లు మింగేసిన చందాన పురుషోత్తమపట్నంలోనూ మొత్తం చుట్టేయాలని మొత్తం జేబులో వేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు విషయంలో పెద్దగా ప్రయోజనం కనిపించకున్నా ఇది విశాఖ , తూర్పుగోదావరి రెండు జిల్లాలను ఎంతో ప్రభావితం చేస్తోంది అని తమ సొంత పేపర్, మీడియాలో తాటికాయంత అక్షరాలతో ప్రతిరోజూ ప్రచారం చేయించుకుని ప్రజలకు ఏదో భారీగా లబ్ధి చేకూరబోతున్నట్లు ,చంద్రబాబు అపర భగీరథడు అన్నట్లు చెప్పుకోవడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్. అయితే ఇది 2019 ఎన్నికల్లో ఏమాత్రం ప్రయోజనం ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ ప్రాజెక్టుల డ్రామాలు ప్రజలు గుర్తించారు. అందుకే పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతాయని చెబుతున్న నియోజకవర్గాల్లో ఎక్కడా టిడిపి గెలవలేకపోయింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, అనకాపల్లి, పిఠాపురం వంటి నియోజక వర్గాల్లో ఎక్కడ టీడీపీ జాడ లేకుండా పోయింది.

ఉమా కాస్త అతి!

2018 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, పూర్తిచేసిన తర్వాతే 2019 ఎన్నికలకు వెళ్తాం అని తెలుగుదేశం ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభ సాక్షిగా చేసిన ప్రమాణమిది. పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రాజెక్టులో ఎడమకాలువ 181.5 కిలోమీటర్లు. కుడి కాలువ 174 కిలో మీటర్లు పొడవు ఉంటుంది. వైయస్ జలయజ్ఞం సమయంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కుడి కాలువ 80 శాతం,ఎడం కాలువ 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఎడమ కాలువ తూర్పుగోదావరి విశాఖపట్నం వరకు వెళ్తూ తాగు సాగు నీటి అవసరాలతో పాటు ఫ్యాక్టరీలకు నీటి అవసరాలు కూడా తీరుస్తుంది.

2018 లోపు ఎట్టి పరిస్థితిలో పోలవరం కట్టి చూపుతామని శపథాలు చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగం అంటూ గోదావరి నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తి పోసి తద్వారా తాగు, సాగు నీటి అవసరాలను విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ద్వారా తీరుస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి?? అసలు గోదావరి నీటిని గ్రావిటీ ద్వారా ఇచ్చుకునే అవకాశం ఉన్న చోట వేల కోట్ల రూపాయలు తగలేసి ఈ ప్రాజెక్టు కట్టడం లో తెలుగుదేశం అత్యుత్సాహం, వారి మీడియా డబుల్ ఉత్సాహం తప్ప పురుషోత్తమపట్నంలో పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించదు.

ఏలేరు కెపాసిటీ ఎంత??

ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ మొత్తంగా కలిపి 24 టిఎంసిలు. గోదావరిలో వరద వస్తే పురుషోత్తమ పట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్ కు పంపాలి అనుకుంటున్న మొత్తం 32 టీఎంసీలు. అంటే ప్రాజెక్టు పరిమితికి మించి గోదావరి నీటిని మళ్ళీస్తారా?? ఒక ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిండితే దాని డిస్పాచ్ అంత సులభమా?? ఎప్పటికప్పుడు 3500 క్యూసెక్కుల నీటిని ఏలేరు పంపించేందుకు సామర్థ్యం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు పురుషోత్తమపట్నం రిజర్వాయర్ నిర్మాణం ప్రకటించిన తర్వాత ఇంజనీర్లు చెప్పిన మాటలను గమనిస్తే కనిపిస్తాయి. 2018 లేక 2019 కి పోలవరం పూర్తి చేయగలమన్న నమ్మకం ఉండి ఉంటే పట్టిసీమనే మొదలు పెట్టేవారు కాదు, ముఖ్యంగా 2016లో అంటే పోలవరం పూర్తిచేయటానికి నిర్ధేశించిన గడువుకు రెండు సంవత్సరాల ముందు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల మొదలు పెట్టేవారు కాదు. పట్టిసీమ పూర్తికాగానే పురుషోత్తమపట్నానికి హడావుడిగా డిపిఆర్ గీయడం వెనుక కేవలం అయినవారికి కాంట్రాక్టులు ఇప్పించుకుని కమిషన్లు దండుకోవడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అప్పటికి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఉత్తుత్తి ప్రాజెక్టుల పేరుతో మొత్తం తినేయాలని పన్నిన పన్నాగం అని అర్థం అవుతుంది.

జగన్ కు సంబంధం ఏమిటీ??

జర్నలిజంలో ప్రాథమిక నియమాలను ఏనాడో వదిలేసిన ఆంధ్రజ్యోతి రాతలు పట్టించుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ సోమవారం సుప్రీంకోర్టులో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని, ఈ ప్రాజెక్టు నిర్మాణం సరికాదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన వెంటనే ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ అంటూ జగన్ ఫొటోతో ఆంధ్రజ్యోతిలో వార్త రాయటం వారికే చెల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ కు ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పురుషోత్తపట్నం నాటకం ఆడారు. ఆ నిజాన్ని దాచి ఇప్పుడేదో ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు జగన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏదో అన్నట్లు ఆంధ్రజ్యోతి కలరింగ్ ఇచ్చి చంద్రబాబు తప్పును కప్పి పుచ్చాలని చూడడం విశేషం.

ఏదైనా ప్రాజెక్ట్ ఆగిపోతే రైతులకు ,రాష్ట్రానికి నష్టం అని రాయవలసింది పోయి ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా నష్టం అని రాయటంలోని దురుద్దేశ్యం ఎవరికైనా అర్ధమవుతుంది.

పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లకు!

కనీసం ప్రాజెక్టు కట్టినప్పుడు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టు నిర్మాణం పనులు రెండు దశలుగా విభజించి టెండర్లు పిలవడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు మానస పుత్రిక పట్టిసీమ ఎత్తిపోతలను కేంద్ర జలసంఘం గుర్తించలేదు,కనీసం ఆడిట్ కూడా చేయలేదు. పట్టిసీమ కోసం చేసిన ఖర్చును పోలవరం పద్దులో చూపటానికి కూడా కేంద్రం అంగీకరించలేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు కేంద్రం ఇచ్చేలా ఒప్పించలేకపోయారని చంద్రబాబు ఇలాంటి అడపాదడపా చిన్న చిన్న ప్రాజెక్టుల పేరు చెప్పి ఖజానాకు నష్టం చేస్తూ సొంత ప్రచారం చేసుకున్నారు.

Show comments