Dharani
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంస్థ ఐఎన్టీయూసీ హవా కొనసాగింది. ఆ వివరాలు..
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంస్థ ఐఎన్టీయూసీ హవా కొనసాగింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వీటి తర్వాత రాష్ట్రంలో తాజాగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. సుమారు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం నాడు జరిగాయి. వీటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో.. 6 చోట్ల ఐఎన్టీయూసీ విజయం సాధించింది.
అలానే సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ కూడా ఈ ఎన్నికల్లో 5 చోట్ల విజయం సాధించింది. మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలు గెలుపొందాయి. అయితే ఈ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ అనుబంధం సంఘం.. టీబీజీకేఎస్ అసలు పోటీలో లేకుండా పోయింది.
సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో భాగంగా ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర కార్మికశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు.
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు బరిలో దిగాయి. ఇందులో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ.. చివరకు వరకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అనబంధ సంస్థ ఐఎన్టీయూసీ 6 చోట్ల.. సీపీఐ అనుబంధ సంస్థ 5 చోట్ల ఏఐటీయూసీ విజం సాధించింది. ఇక బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అసలు పోటీలో లేకుండా పోయింది.
అయితే గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్.. ఈసారి అసలు పోటీలో లేకుండా పోయింది. మొదటి నుంచి తాము బరిలో ఉండి ఏరియాలో పట్టు సాధిస్తామని చెప్పుకుంటూనే గనులు, డిపార్ట్ మెంట్లలో ప్రచారాన్ని కొనసాగించిన సదరు నాయకులు ఎన్నికల రోజు పత్తా లేకుండా పోయారు. తమ ప్రత్యర్ధి ఐఎన్టీయూసీ ఈ ఎన్నికల్లో గెలువకూడదనే ఉద్ధేశ్యంతో.. టీబీజీకేఎస్.. ఏఐటీయూసీ కార్మిక సంఘానికి ఇంటర్నల్గా మద్దతు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.