రైలు ప్రమాద వార్తలు ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇటీవల ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మహా విషాదంలో వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కోరమాండల్ రైలు మెయిన్ ట్రాక్లో నుంచి లూప్ లైన్లోకి వచ్చి.. అక్కడ అప్పటికే ఆడి ఉన్న గూడ్సును ఢీకొట్టడంతో దాని బోగీలు పట్టాలపై పడ్డాయి. అదే టైమ్లో యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ దూసుకొచ్చింది. బాలాసోర్లో జరిగిన ఈ యాక్సిడెంట్లో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం వల్ల వందలాది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి.
సిగ్నలింగ్ వైఫల్యం వల్లే ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని రైల్వే భద్రత కమిషనర్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సిగ్నలింగ్ లోపంతో పాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని సీఆర్ఎస్ నివేదిక తేల్చి చెప్పింది. రైల్వే బోర్డుకు ఈ మేరకు సీఆర్ఎస్ ఒక రిపోర్టును సమర్పించింది. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణలోనూ ఒక రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఈ రైలును యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య నిలిపివేశారు.
రైలులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు రావడంతో ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ వెంటనే దిగిపోయారు. సమయానికి మంటలు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దట్టంగా వ్యాపించిన మంటల్ని ఫైరింజన్లు ఆర్పివేస్తున్నాయి. మంటల కారణంగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు చెందిన నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. ఫలక్నుమా రైలులో 1,500 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.