Idream media
Idream media
నివర్ తుపాను, పంట నష్టం, ఇసుక, పోలవరం, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై ఏపీ మంత్రి వర్గం చర్చించింది. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాయలంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో తుపాను తీవ్రత, పంట నష్టంపై చర్చించారు. సిబిరాల్లో ఉన్న వరద బాధితులకు వెంటనే 500 రూపాయలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 15వ తేదీ నాటికి పంట నష్టం వివరాలను సేకరించినాలని, డిసెంబర్30వ తేదీకి పంట నష్టపరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.
పోలవరం ఎత్తుపై ఇటీవల జరిగిన ప్రచారంపైనా మంత్రివర్గంలో చర్చించామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని మంత్రివర్గం ఖండించింది. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గించబోమని సీఎం స్పష్టం చేసినట్లు కన్నబాబు చెప్పారు. డిసెంబర్ 25వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే తొలి దశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు కన్నబాబు తెలిపారు.
ఏపీలో ఇసుక కష్టాలకు కేబినెట్ చెక్ పెట్టింది. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 2వ తేదీన ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని కన్నబాబు తెలిపారు. అంగన్వాడీలు, హోంగార్డులకు ఉన్న జీతాల బకాయల విడుదలకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 11 వేల కోట్ల రూపాయల డీఏ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టబోయే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Also : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మరో క్యాలెండర్.. ఆమోదించిన ఏపీ కేబినెట్