idream media
idream media
సిబిఐ అధికారులమని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడిని కిడ్నాప్ చేసిన సంఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ సోదరుడు లుకోయి సింగ్ కోల్ కతాలో న్యూ టౌన్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు తాము సీబీఐ అధికారులమని నమ్మించి లుఖోయి, ఆయన అనుచరుడిని వెంట తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత లుఖోయి భార్యకు ఫోన్ చేసి రూ. 15లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు.
దీంతో లుఖోయి భార్య ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాయంత్రానికల్లా కిడ్నాపర్లను పట్టుకుని లుఖోయి, ఆయన అనుచరుడిని రక్షించారు.
దుండగుల్లో ఇద్దరు కోల్కతా, ఇద్దరు మణిపూర్, మరో వ్యక్తి పంజాబ్కు చెందినవారిగా గుర్తించారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, మూడు బొమ్మ తుపాకులు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ చేసినట్లు కిడ్నాపర్లు పోలీసులకు వెల్లడించారు.