Yellandu Market Only Rs 20 For KG Vegetables: రూ. 20 కే కిలో కూరగాయలు.. ఎగబడుతున్న జనాలు.. మన దగ్గరే!

రూ. 20 కే కిలో కూరగాయలు.. ఎగబడుతున్న జనాలు.. మన దగ్గరే!

ప్రస్తుతం కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా, పచ్చిమిర్చి రేటు గురించి అసలు మాట్లాడకపోతేనే మంచిది. అవి కిలో ఏకంగా సెంచరీ దాటాయి. మండుతున్న కూరగాయల ధరలు చూసి సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి అనే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయల ధరలు కూడా కిలో 60 రూపాయలపైనే పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఓ కూరగాయల వ్యాపారి.. 20 రూపాయలకే కిలో చొప్పున కూరగాయలు అమ్ముతూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. ఇక 20 రూపాయలకే కిలో కూరగాయలు అనడంతో జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కూరగాయల వ్యాపారి ఎస్ కే గౌస్.. ఇలా రూ.20లకే కిలో చొప్పున కూరగాయలు అమ్ముతూ ఔదార్యం చాటుతున్నాడు. టమాటా, పచ్చిమిర్చి తప్ప.. మిగిలిన అన్ని కూరగాయలు కేజీ కేవలం 20 రూపాయలకే అమ్ముతూ మంచి మనసు చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఇల్లందు మార్కెట్‌లో బెండకాయ, వంకాయ, కాకరకాయ, దొండకాయ వంటి కూరగాయలు కేజీ 60 రూపాయలు దాటింది. దాంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే బయపడుతున్నారు. ఈ క్రమంలో పేద, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా.. అ టమాటా, పచ్చిమిర్చి మినహా.. మిగిలిన అన్ని రకాల కూరగాయలను కేజీ 20 రూపాయలకే అమ్ముతున్నాడు గౌస్‌. దాంతో జనాలు అతడి వద్ద కూరగాయలు కొనేందుకు ఎగబడుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల రేట్లు మండిపోతుండటంతో.. సామాన్యులు వాటిని కొనాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితిలో లేని నిరుపేదలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో.. కూరగాయలు రేట్లు తగ్గే వరకు.. వాటి మీద ఎటువంటి లాభం లేకుండా అమ్మకాలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు గౌస్ తెలిపాడు. ప్రజలకు ఇబ్బంది లేకుండా. తక్కువ ధరకే కూరగాయలు అమ్ముతున్న గౌస్ ఔదార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Show comments