Dharani
విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Dharani
విజన్ విశాఖ సదస్సులో పాల్గొనడం కోసం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని ప్రకటించారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను అని చెప్పడంతో.. వైజాగే పాలన రాజధాని అని మరొకసారి చెప్పకనే చెప్పారు సీఎం జగన్. విజన్ విశాఖ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తా.. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. కాస్త మెరుగులు దిద్దితే విశాఖ మంచి రాజధాని అవుతుందని.. ఇకడ ఆర్థికపరమైన వృద్ధి బాగుంది అన్నారు. ఇప్పుడు అమరావతిలో రాజధాని అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలపైనే ఖర్చు చేయాలని చెప్పుకొచ్చారు. పదేళ్లలో హైదరాబాద్, చెన్నైకి పోటీగా వైజాగ్ ఉండాలన్నారు. అందుకనే అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని తెలిపారు.
‘‘అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఐకానిక్ సచివాలయం, ఉద్యోగులు విశాఖ వస్తే.. మొత్తం మార్పు కనిపిస్తుంది. అప్పుడు దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్శిటీ ఇక్కడకు రావాలి. అత్యాధునిక సాంకేతికతపై ఇక్కడ బోధన జరగాలి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం అవుతోంది. భోగాపురానికి ఆరు లేన్ల బీచ్ కారిడార్ రోడ్ ఏర్పాటు చేశాం’’ అని చెప్పుకొచ్చారు.
‘‘వైజాగ్ విషయానికొస్తే.. బేసిక్ ఇన్ఫ్రా ఉంది. కాస్త మెరుగులు దిద్దితే విశాఖ మంచి రాజధాని అవుతుంది. అమరావతి అభివృద్ధికి ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అనుకుంటే.. రానున్న 20 ఏళ్లలో 10-15 లక్షల కోట్లు అవుతుంది. అందుకే మూడు రాజధానుల ప్రతిపాదను తీసుకొచ్చాను. దానికే కట్టుబడి ఉన్నాను. ఎన్నికల తర్వాత వైజాగ్లోనే ఉంటాను.. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను’’ అని జగన్ మరోసారి స్పష్టం చేశారు.
విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్ నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న జగన్.. ఆ తర్వాత యువతతో భేటీ అయ్యారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అంతేకాక జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సం చేశారు జగన్.