iDreamPost
iDreamPost
మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట పరిస్థితి పూర్తిగా సద్దుమణగడం కోసం ఎదురు చూస్తోంది. కీలక భాగం అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది కాబట్టి అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు. కరోనా ప్రభావం ఇక్కడున్నంత ఎక్కువగా యుఎస్ లో లేదు. అక్కడ థియేటర్లు కూడా తెరిచారు. సో షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా. హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు గతంలోనే వినిపించింది కానీ ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు. తను కూడా ఇందులో ఉన్నట్టు లేనట్టు ఏదీ చెప్పడం లేదు. బహుశా డేట్స్ లాక్ అయ్యాక అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
ఇందులో చాలా ముఖ్యమైన మహేష్ అక్కయ్య పాత్రకు బాలీవుడ్ టాలెంటెడ్ నటి విద్యా బాలన్ ను ప్రయత్నిస్తున్నట్టు తాజా సమాచారం. కథలో మలుపు తిప్పే విధంగా ఉండే ఈ రోల్ పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేస్తోందట. అందుకే మొక్కుబడిగా ఎవరినో తీసుకోవడం కన్నా విద్యా అయితేనే కరెక్ట్ అని పరశురామ్ భావిస్తున్నట్టు వినికిడి. దీనికి మహేష్ కూడా సానుకూలంగానే ఉన్నారట. విద్యా బాలన్ ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ తర్వాత మళ్ళీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలో కనిపించలేదు. హిందీలో మాత్రం బిజీగానే ఉంది. ఆ మధ్య ఓటిటిలో రిలీజైన శకుంతలాదేవిలో తన నటనతో అదరగొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సర్కారు వారి పాటలో తను కూడా జాయిన్ అయితే క్యాస్టింగ్ కు మరింత బలం వస్తుంది.
సిస్టర్ సెంటిమెంట్ తో మహేష్ చేసిన సినిమా అర్జున్ ఒక్కటే. భారీ హంగుల్లో కథాకథనాలు కొట్టుకుపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. సర్కారు వారి పాటలో అంత హెవీ సెంటిమెంట్ ఉండదు కానీ విద్యా బాలన్ కు మాత్రం చాలా స్కోప్ ఉండబోతున్నట్టు తెలిసింది. తమన్ ఇప్పటికే ట్యూన్స్ కంపోజింగ్ ఒక కొలిక్కి తెచ్చినట్టు టాక్. టైటిల్ సాంగ్ లో చిన్న బిట్ ని మోషన్ పోస్టర్ కి వాడిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ తర్వాత తమన్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు మాములుగా లేవు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినిమా కూడా ఇదే. ఆరకంగానూ హైప్ భారీగా ఉంది. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి దీని రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు