గత కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పెట్రోల్పై 5 పైసలు, డీజిల్పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.43, లీటర్ డీజిల్ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్ డీజిల్పై మొత్తం రూ.10.39లు, లీటర్ పెట్రోల్పై రూ.9.23లు పెరిగాయి.
కానీ పొరుగుదేశం పాకిస్థాన్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు ఒకేసారి పెద్దమొత్తంలో పెరిగి వాహనదారులకు షాక్ ఇచ్చాయి. పెరగడం అంటే 5 రూపాయలో పదిరూపాయలో కాదు పెట్రోల్ పై ఏకంగా 25 రూపాయలు పెంచింది పాకిస్థాన్ ప్రభుత్వం. డీజిల్ పై 21 రూపాయలు పైగానే వడ్డించింది. దాంతో లీటర్ పెట్రోల్ ధర రూ.74.52 నుంచి రూ.100.10కు చేరగా డీజిల్ ధర లీటరుకు రూ.80.15 నుంచి రూ.101.46 కు చేరింది. పెట్రోల్ ధర రూ.25.58 పెరగగా, డీజిల్ 21.31రూపాయలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ & డీజిల్ కొనాలి అంటే 100 కు పైగా సమర్పించుకోవాల్సిందే. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు కిరోసిన్ ధర కూడా పెరిగింది. గతంలో పాకిస్థాన్ లో లీటరుకు రూ.35.56 ఉండే కిరోసిన్ ధర రూ.59.06కు చేరింది. అంటే రూ.23.05 కిరోసిన్ ధర పెరగడం గమనార్హం.