P Venkatesh
P Venkatesh
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య రాజకీయంగా పెనుదుమారం రేపింది. అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ గదిలో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఆత్మహత్యకు గ్రూప్ 2 ఉద్యోగ పరీక్ష వాయిదా పడడమే కారణమంటూ పలు పార్టీల రాజకీయ నాయకులు నానా రచ్చ చేశారు. కానీ పోలీసులు రంగ ప్రవేశంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. కాగా ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన బీఆర్ఎస్ మూడో సారి గెలిచి అధికారం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవళిక అంశాన్ని లేవనెత్తారు. ప్రవళిక ఆత్మహత్యను కొందరు చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలె ప్రవళిక కుటుంబం తనను కలిశారని అన్నారు. వేదింపులు వల్లె తమ కూతురు చనిపోయిందని ప్రవళిక కుటుంబ సభ్యులు తెలిపినట్లు చెప్పారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని, వారి కుటుంబానికి అన్నివిదాల అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలో మరో సంచలన ప్రకటన చేశారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.