ఇక శుక్రవారాలు థియేటర్లకు పోటీగా OTTలు

ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం సినిమాల మధ్య పోటీని థియేటర్లు వేదికగా చూసేవాళ్ళం. ఇప్పుడు దీనికి ధీటుగా ఓటిటి లు కూడా రెడీ అవుతున్నాయి. లాక్ డౌన్ అయిపోయింది హాళ్లు తెరుచుకున్నాయి కదా ఇక స్ట్రీమింగ్ సంస్థల స్పీడ్ తగ్గుతుందని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. కానీ సదరు కంపెనీలకు ఆ ఉద్దేశాలు ఏమి లేవు. అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని థియేట్రికల్ రిలీజులకు సెంటిమెంట్ గా భావించే ఫ్రైడేనే తమ కొత్త కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డిసైడ్ అవుతున్నాయి. దీని వల్ల ముందు ఫ్రీగా అందుబాటులో ఉన్నది చూద్దామనే ధోరణి ఆడియన్స్ లో వచ్చిన ఆశ్చర్యం లేదు.

రేపు బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అల్లరి నరేష్ నాంది, సుమంత్ కపటధారి, విశాల్ చక్రలతో పాటు కన్నడ డబ్బింగ్ పొగరు వస్తున్నాయి. బుకింగ్స్ పరంగా బజ్ పరంగా అన్నీ సమానంగానే కనిపిస్తున్నప్పటికీ చక్రకు కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది. మిగిలినవి టాక్ మీద డిపెండ్ కావాల్సిందే. ఒకపక్కా స్ట్రాంగ్ గా ఉన్న ఉప్పెనను స్లో చేయాలంటే ఇవి యావరేజ్ గా ఉంటే సరిపోదు. గట్టిగానే మెప్పించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఒకేరోజు పోటీ పడటం పరస్పరం కలెక్షన్ల మీద ప్రభావం చూపించడం ఖాయమే అయినా తప్పని పరిస్థితిలో నిర్మాతలు ఇలా ఒకరి సినిమా మీదకు మరొకరు వెళ్తున్నారు.

ఇక ఓటిటి విషయానికి వస్తే రేపు రెండు క్రేజీ కంటెంట్స్ మూవీ లవర్స్ దృష్టిని ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అందులో మొదటిది నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో రూపొందించిన పిట్టకథలు. నలుగురు టాలెంటెడ్ డైరెక్టర్లతో బాగా పేరున్న క్యాస్టింగ్ ని పెట్టుకుని ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటిదాకా శంషాబాద్ లో ఎవరికీ దక్కని హోర్డింగ్ పబ్లిసిటీని పిట్టకథలు దక్కించుకుంది. ఇక రెండోది మోహన్ లాల్ దృశ్యం 2. తెలుగు వెర్షన్ లేనప్పటికీ సబ్ టైటిల్స్ సహాయంతో చూసేందుకు మనవాళ్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు. నిజానికి ఓటిటి కంటెంట్ ని ఎప్పుడు విడుదల చేసినా ఒకటే. కానీ థియేటర్లకు పోటీ ఇవ్వడానికే అన్నట్టుగా శుక్రవారాన్నే లక్ష్యంగా పెట్టుకోవడం ఆసక్తికరం

Show comments